ఆగస్టు 15 నుంచి ఏపీ పౌరులకు వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా 700 ప్రభుత్వ సేవలు

ఆగస్టు 15 నుంచి ఏపీ పౌరులకు మనమిత్ర వాట్సాప్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా 700 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం చంద్రబాబు కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు, పాలనలో డ్రోన్లు మరియు AI వినియోగాన్ని ప్రవేశపెట్టారు.

Vineela Sekhar
Published on: 12 Aug 2025 1:06 PM IST
ఆగస్టు 15 నుంచి ఏపీ పౌరులకు వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా 700 ప్రభుత్వ సేవలు
X

From August 15, Andhra Pradesh Citizens to Get 700 Government Services via WhatsApp Governance

ఆంధ్రప్రదేశ్ పౌరులకు మరో శుభవార్త. ఆగస్టు 15 నుంచి మ‌న‌మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం ద్వారా రాష్ట్ర ప్రజలకు 700 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

సీఎం చంద్రబాబు సూచనలు

సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించిన సీఎం, వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా పౌరులు సేవలు పొందడంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ప్రజలు వాట్సాప్ ద్వారానే సులభంగా సేవలు పొందేలా, దీనిపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు.

అదేవిధంగా, ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం రూపొందించిన అవేర్ 2.0 వెర్షన్‌ను సీఎం ఆవిష్కరించారు. రియల్ టైమ్ డేటా విశ్లేషణ చేసి సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలని, గ్రామాల చెరువుల పరిస్థితి, నీటి నిల్వలు, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని తెలిపారు.

ట్రాఫిక్ నియంత్రణ & భద్రతా చర్యలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చేసిన వారికి, వాట్సాప్ ద్వారా ఉల్లంఘన వీడియోలు పంపి, భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా చైతన్యం కల్పించాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు.

డ్రోన్ వినియోగం విస్తరణ

ప్రస్తుతం రాష్ట్రంలో 45 డ్రోన్ యూస్ కేసులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించగా, ముఖ్యమంత్రి వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం పెంచాలని సూచించారు. పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం, అంటువ్యాధుల నియంత్రణ, దోమల నివారణలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని చెప్పారు. డ్రోన్ సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

డేటా & AI వినియోగం

ఆర్టీజీఎస్ డేటా లేక్ పనులను నవంబర్‌లోగా పూర్తి చేయాలని, ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులపై శాస్త్రీయ విశ్లేషణ అవసరమని పేర్కొన్నారు.

Vineela Sekhar

Vineela Sekhar

Next Story