అమరావతిలో 4 వేల ఎకరాలకు పైగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు, పేర్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది...
అమరావతిలో 4 వేల ఎకరాలకు పైగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు, పేర్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది వైసీపీ. ఇందులో భాగంగా టీడీపీ నేతల పేర్లను సర్వే నెంబర్లతో సహా బయటపెట్టింది. ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో లేని ఉద్యమాన్ని సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. తన బినామీ భూముల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికే కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతుల బాధపడాల్సిన అవసరం లేదని తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గతంలో రాయలసీమ వాసులమైన తాము రాజధానిని త్యాగం చేశామని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఒకేచోట మహానగరం కోసం లక్షల కోట్ల రూపాయలు స్థిరీకరించడం కన్నా ఆ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా ఖర్చు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా సాగునీటి ప్రాజెక్టుల పనులు పెండింగులో ఉన్నాయన్న ప్రకాష్ రెడ్డి.. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. దానికి దాదాపుగా రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇంకా నాడు - నేడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఖర్చులు ఉన్నాయని అన్నారు. ఇది మరచి ఒకేచోట నగర నిర్మాణం కోసం లక్షల కోట్లు ఉపయోగించడంలో అర్ధం లేదన్నారు. ఇలా చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయగలమని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాదు అమరావతిలో కచ్చితంగా రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు ప్రకాష్ రెడ్డి. ఇక అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తాము మూడు రాజధానులు ఏర్పాటు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో అమరావతిలో కచ్చితంగా లెజిస్లేచర్ క్యాపిటల్ ఉంటుందని.. అలాగే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ లో హైకోర్టు ఉండేలా ప్రతిపాదనను తమ ప్రభత్వం ఆలోచిస్తోందని అంబటి స్పష్టం చేశారు.
ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ పై త్వరలో విచారణ జరుగుతుందని.. ఇందులో చంద్రబాబు బినామీ బాగోతాలు మరింతగా బయటికి వస్తాయని ఆయన అన్నారు. గుక్కెడు పాలు, కేజీ ఉల్లిపాయలు ఇవ్వని భువనేశ్వరి గారు.. అమరావతిలో ఆందోళన చేస్తున్న ఉద్యమానికి బంగారు గాజులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అంబటి రాంబాబు. హై సెక్యూరిటీ పరిధిలో ఉన్న సీఎంకు భద్రతలో భాగంగా సచివాలయం ప్రాంతంలో ముళ్లకంచె వేస్తే.. పవన్ కళ్యాణ్ ను వెళ్లనీయకుండా ముళ్లకంచెను వేశారని చంద్రబాబు అనడం విడ్డురంగా ఉందని అన్నారు. తాను కట్టిన అసెంబ్లీలోనే తనకు మైక్ ఇవ్వడం లేదని అన్న చంద్రబాబు అసెంబ్లీని ఏమన్నా చంద్రబాబు ఇంట్లో డబ్బులతో కట్టారా? అని ప్రశ్నించారు. అప్పట్లో అమరావతిలో రైతుల భూములు లాక్కున్నారని ఊరేగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రైతుల భూములు ఇస్తామంటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిల్లికి బిక్షం పెట్టని చంద్రబాబు తన బినామీ భూముల కోసం బంగారు గాజులు ఇప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలవంతంగా లాక్కున్న భూములను వెనక్కి ఇప్పిస్తామని చెప్పామని అదే మాటకు ఇప్పుడు కట్టుబడి ఉన్నామని అంబటి స్పష్టం చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire