Breaking: గుంటూరులో తెలుగు మహాసభ 2026, సాంస్కృతిక రంగులు & ఉత్సవాల హల్చల్


గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనలు, సాహిత్య చర్చలు మరియు అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో తెలుగు వారసత్వం, సంస్కృతుల వేడుక మూడు రోజుల పాటు సాగనుంది.
గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. వెయ్యి మందితో నిర్వహించే 'అన్నమయ్య సంకీర్తనల' గానంతో ఈ మహాసభలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పామిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు గుంటూరు మేయర్ రవీంద్ర హాజరుకానున్నారు. ప్రధాన వేదికతో పాటు మరో నాలుగు ఉప వేదికలపై సాహిత్య చర్చలు, కవి సమ్మేళనాలు మరియు తెలుగు సినీ సంగీత విభావరి కార్యక్రమాలు జరగనున్నాయి.
తెలుగు భాషను ప్రజలకు చేరువ చేయడం
ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు మరియు సభ నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రజలకు చేరువ చేయడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రాచీన తెలుగు తాళపత్ర గ్రంథాలు, చారిత్రక నాణేలు మరియు సంప్రదాయ వంటకాలతో కూడిన 'రామోజీరావు హస్తకళల పెవిలియన్' సందర్శకులను ఆకట్టుకోనుంది. శనివారం సాయంత్రం జరిగే 'ఆంధ్రశ్రీ పూర్ణకుంభ అవార్డుల' ప్రధానోత్సవానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.
అంతర్జాతీయ ప్రముఖులు మరియు విశిష్ట అతిథులు
ఈ మహాసభల్లో జస్టిస్ సి.హెచ్. మానవేంద్రనాథ్ రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వంటి ప్రముఖులు వివిధ సెషన్లలో పాల్గొంటారు. రెండో రోజైన ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశానికి మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మండలి చైర్మన్ మోషేన్ రాజు మరియు ఇతర మంత్రులు పాల్గొంటారు. అదే రోజు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా హాజరవుతారు.
ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రాక
చివరి రోజైన సోమవారం ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు మరియు పలువురు ఉన్నత స్థాయి మంత్రులు హాజరుకానున్నారు. తెలుగు సంస్కృతికి వెలకట్టలేని సేవ చేసిన దిగ్గజ గాయకులు డాక్టర్ ఘంటసాల మరియు డాక్టర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంల జ్ఞాపకార్థం సభా వేదికలకు వారి పేర్లను నామకరణం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



