శ్రీవారి ఆస్తుల వేలం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన.

శ్రీవారి ఆస్తుల వేలం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన.
x
Highlights

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ ) ఏపీ‌, త‌మిళ‌నాడు‌లో దేవాలయానకిి చెందిన ఆస్తులు బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌డానికి నిర్ణ‌యం తీసుకుంది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ ) ఏపీ‌, త‌మిళ‌నాడు‌లో దేవాలయానకిి చెందిన ఆస్తులు బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌డానికి నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆస్తులు దేవ‌స్థానానికి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌నివేనని వెల్లడించారు. కొన్ని టివి ఛాన‌ళ్ళ‌లో ఈ విష‌యానికి సంబంధించిన తప్పుడు స‌మాచారంతో భ‌క్తుల్లో గంద‌ర‌గోళం ఏర్ప‌డిందని తెలిపారు. బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. వాస్తవాలు ఇవే అంటూ ఆయన కొన్ని వివరాలను తెలియజేశారు. జివో ఎంఎస్ నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), (09 - 04 - 1990) రూల్ -165, చాప్ట‌ర్ - 22, ద్వారా టీటీడీకి మేలు క‌లిగే అవ‌కాశం ఉంటే దేవ‌స్థానం ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం, లీజుకు ఇవ్వ‌డం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయని చెప్పారు.

1974 నుంచి దేవ‌స్థానం నిర‌ర్థ‌క ఆస్తుల అమ్మక ప్ర‌క్రియ జ‌రుగుతోందన్నారు. ఈ ర‌కంగా 2014 వ‌ర‌కు 129 ఆస్తుల‌ను బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించినట్టు తెలిపారు. ఇదే క్ర‌మంలో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి అధ్య‌క్షులుగా ఉన్న పాల‌క‌మండ‌లి తీర్మానం నంబ‌రు 84 (28 - 07 - 2015) మేర‌కు టీటీడీకి ఏర‌కంగాను ఉప‌యోగ‌ప‌‌డ‌ని ఆస్తుల‌ను గుర్తించి బ‌హిరంగ వేల‌ం ద్వారా వాటిని విక్ర‌యించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించ‌డానికి ఒక స‌బ్ క‌మిటీని నియ‌మించినట్లు చైర్మన్ చెప్పారు. ఈ స‌బ్ క‌మిటీలో అప్ప‌టి పాల‌క మండ‌లి స‌భ్యులు జి.భాను ప్ర‌కాష్‌రెడ్డి, జె.శేఖ‌ర్‌, డి.పి.అనంత, ఎల్లా సుచ‌రిత, సండ్ర వెంక‌ట వీర‌య్యలను స‌భ్యులుగా నియ‌మించారన్నారు.

ఈ తీర్మానం నెం. 253 (తేదీ 30 - 01- 2016) ద్వారా ఏపీతో పాటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌లో స‌బ్ క‌మిటీ గుర్తించిన 50 నిర‌ర్థ‌క ఆస్తుల‌ను బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌డానికి చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ఆధ్య‌క్ష‌త‌న పాలక మండ‌లి ఆమోదం తెలిపినట్లు వెల్లడిించారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల‌లో గ‌ల 17 ఆస్తులు, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లోని 9 ఆస్తులు, త‌మిళ‌నాడులోని గ్రామీణ ప్రాంతాల‌లో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యాల రికార్డుల‌లోని విలువ, బ‌హిరంగ మార్కెట్ విలువ‌ల‌ను సేక‌రించి పాల‌క‌మండ‌లికి నివేదించింది. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండ‌టంతో.. వేలం ప్ర‌క్రియ నుంచి మినహాయించడం జ‌రిగింది. అలాగే రుషికేష్‌లో ఒక ఎక‌రా 20 సెంట్ల భూమి వ‌ల్ల టీటీడీకి ఎలాంటి ఉప‌యోగం లేకుండా దురాక్ర‌మ‌ణ‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉండ‌టంతో దీన్ని కూడా వేలం జాబితాలో చేర్చినట్లు చైర్మెన్ చెప్పారు.

ఆ తీర్మానం మేర‌కు 50 నిర‌ర్థ‌క ఆస్తుల విలువ‌ను రూ. 23.92 కోట్లుగా ప్ర‌స్తుత పాల‌క మండ‌లి తీర్మానం నెం.309 (తేదీ 29-02 - 2020) ద్వారా ధ‌ర నిర్ణ‌యిస్తూ గ‌త పాల‌క మండ‌లి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌డానికి ఆమోదం మాత్రమే తెలపామన్నారు. అవాస్తవ సమాచారం తో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సరి కాదని సుబ్బారెడ్డి హితవు చెప్పారు. నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయన్నారు. వీటివలన దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేక పోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ం ద్వారా విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్టు చెప్పారు. అయితే కొన్ని ప్ర‌సార సాధ‌నాలు టీటీడీ ఆస్తుల వేలం విక్ర‌యానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న... కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు , ప్ర‌భుత్వానికి లింకు పెట్ట‌డం స‌రికాదని వైవీ సుబ్బా రెడ్డి చెప్పారు. ఈ ఆస్తులు దేవ‌‌స్థానానికి ఏవిధంగానూ ఉప‌యోగ‌ప‌డేవి కాదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories