Andhra Pradesh: నేడు ఏపీ బంద్

Andhra Pradesh:విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు * బంద్‌కు మద్దతు ఇచ్చిన అఖిలపక్షం

Sandeep Eggoju
Updated on: 5 March 2021 6:59 AM IST
Today Andhra Pradesh Bandh
X

ఆంధ్రప్రదేశ్ బంద్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: విశాఖ సాగర తీరంలో ఉద్యమ కెరటాలు ఎగసి పడుతున్నాయి. ఉక్కు పిడికిలి బిగించిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. రోజుకో రూపంలో ఆందోళనలు తెలుపుతున్నాయి. దాంతో కార్మిక సంఘాలు ఇవాళ రాష్ట్రం బంద్‌కు పిలుపునిచ్చాయి.

కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు ఇచ్చాయి. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఎగసి పడేలా నిరసనలు చేపడుతున్నారు. ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్‌కు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పాటు, అధికార వైసీపీ కూడా మద్దతు తెలిపింది.

ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్‌కు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రజల ఆస్తిగానే ఉంచాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. బంద్‌ కారణంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఒంటిగంట తర్వాత కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇటు టిడిపి,సిపీఎం,సిపీఐ పార్టీలు బంద్ కు సంపూర్ణ మద్థతు ప్రకటించాయి.

మరోవైపు ఇవాళ చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్ర బంద్‌కు టీడీపీ మద్దతు పలికింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story