ఏపీలో మందుబాబులకు ఆ చాన్స్ కూడా లేదు.. షాకిచ్చిన ప్రభుత్వం

ఏపీలో మందుబాబులకు ఆ చాన్స్ కూడా లేదు.. షాకిచ్చిన ప్రభుత్వం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులకు షాక్ ఇచ్చింది

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. మద్య నిషధం దిశగా అడుగులు అంటూ ఇప్పటికే మద్యం ధరలు విపరీతంగా పెంచింది ప్రభుత్వం. అటు తరువాత సరైన బ్రాండ్ లు కూడా దొరక్కుండా చేశారు. ఇప్పుడు మద్యం సరిహద్దులు దాటి రాకుండా కొత్త రూల్ తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ చుట్టూ వున్న ఆరు రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈరోజు కొత్త నోటిఫికేషన్ తీసుకువచ్చింది.

పక్క రాష్ట్రాల నుంచి ఇకపై మద్యం తీసుకొచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వం జీవో జారీ చేసింది. మధ్య నిషేధంలో భాగంగా ఏపీలో ఇప్పటికే బెల్ట్ షాపులు రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తోంది. అలాగే మధ్యం ధరలు కూడా పెంచేసింది. దీంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేసుకుంటున్నారు. కొందరైతే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసుకొని ఏపీలో విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క మద్యం బాటిల్ కూడా తీసుకురావడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పన్నులు చెల్లించి మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదివరకులా ఒక వ్యక్తి మూడు మద్యం బాటిళ్ళు తెచ్చుకునేందుకు ఇకపై అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 310 ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా మద్యం తెస్తే మాత్రం 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులని ఆ జీవోలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే ఈ జీవో ప్రకారం నేరంగా పరిగణిస్తారు. అయితే విదేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

కాగా, ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు ఇటీవలే కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది. తాజాగా, ఈ జగన్ ప్రభుత్వం ఈ వెసులుబాటును కూడా లేకుండా జీవో జారీ చేసింది. ఎవరైనా పన్నులు చెల్లించకుండా మద్యం తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories