నెట్ కార్బన్ జీరో చేయటమే లక్ష్యం: సీఎస్ విజయానంద్

రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ తగ్గించి నెట్ కార్బన్ జీరో చేయటమే లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎమ్) చైర్మన్ కె. విజయానంద్ చెప్పారు.

Siramdasu Nagarjuna
Published on: 20 Dec 2025 5:53 PM IST
నెట్ కార్బన్ జీరో చేయటమే లక్ష్యం:  సీఎస్ విజయానంద్
X

విజయవాడ: రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ తగ్గించి నెట్ కార్బన్ జీరో చేయటమే లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎమ్) చైర్మన్ కె. విజయానంద్ చెప్పారు. నాలుగో ఏడాది కూడా ఇంధన పరిరక్షణలో జాతీయ స్థాయిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సోలార్ రూఫ్ ప్రోత్సహించడం ద్వారా ఎనర్జీ ఆదా చేయొచ్చు అని అన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడమంటే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లేనని చెప్పారు. కర్భన రహితంగా రాష్ట్రాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు ఇచ్చారు.

స్థానిక వివంతా హోటల్ లో శనివారం ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ వాలిడిక్టరీ కార్యక్రమం – 2025 స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ సెర్మనీ, షార్ట్ వీడియో కాంపిటీషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధన పరిరక్షణలో గత నాలుగేళ్లుగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోందని, భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నామన్నారు. 2015 లో హుదూద్ తుపాను తర్వాత వైజాగ్ నగరంలోని స్ట్రీట్ లైట్లన్నింటినీ ఎల్‌ఈడీ లైట్లుగా మార్చామని దీనివల్ల దాదాపు 45% వరకు ఇంధన పొదుపు సాధ్యమైందన్నారు. ఈ లైట్ల ను రిమోట్ ద్వారా మానిటర్ చేయడానికి CCMS (Central Control and Monitoring System) బాక్సులను కూడా ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన BEE (Bureau of Energy Efficiency), EESL (Energy Efficiency Services Limited) భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 కోట్లకు పైగా ఇళ్లలో ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశామని, దీనివల్ల 30% విద్యుత్ ఆదా అయిందన్నారు. ఫ్రిక్షన్ లేని ఎనర్జీ ఎఫీషియంట్ అగ్రికల్చర్ మోటార్లను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ రంగంలో ఇంధన పొదుపు ను ప్రోత్సహించామన్నారు. ఇండస్ట్రీలలో 'పెర్ఫార్మెన్స్ అచీవ్ అండ్ ట్రేడ్' (PAT) స్కీమ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.

ఏపీ జెన్కో సీఈవో, ఏపీఎస్ఈ సీఎం ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ద్వారా ప్రతి సంవత్సరం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామని, దీనిలో భాగంగా ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని విభాగాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. ఏపీసిపిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి పుల్లారెడ్డి మాట్లాడుతూ ఇంధన పరిరక్షణ అవార్డులు గెలుచుకున్న సంస్థలకు, షార్ట్ వీడియో పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమం అనంతరం ఇండస్ట్రీస్, సిమెంట్, ఫార్మా, బిల్డింగ్స్ కేటగిరీ, హోటల్స్ కేటగిరి, ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ లు, ఇనిస్టిట్యూషన్ కేటగిరీలలో అవార్డులు, స్కూల్ పిల్లలకు షార్ట్ వీడియో కాంపిటిషేన్స్ లో కన్సోలేషన్ బహుమతులను ప్రధానం చేశారు. మొదటి బహుమతి కింద రూ. 20,000, రెండో బహుమతి రూ. 10,000, మూడో బహుమతి గా రూ. 5,000 అందించారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story