
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకుని, లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది.
అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకుని, లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో ఈరోజు ఉదయం 10 గంటలకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. తొలి రోజు సీసీఎల్ఏ స్వాగతోపన్యాసంతో మొదలు కానున్న కలెక్టర్ల కాన్ఫరెన్సులో పరిపాలనకు సంబంధించిన కీలకాంశాలపై సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. సుపరిపాలన-సుస్థిరాభివృద్ధి-సంక్షేమం అజెండాగా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అభివృద్ధి లక్ష్యాలు వంటి వాటిపై తొలి రోజు సమావేశంలో కీలక చర్చ జరగనుంది. దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఆయా రంగాల్లో ఎలా పని చేయాలనే విషయమై సీఎం సూచనలు చేయనున్నారు. అలాగే వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో ప్రజల సంతృప్త స్థాయి ఏ మేరకు ఉందనే అంశం పైనా తొలి రోజు సమావేశంలో సీఎం సమీక్షించనున్నారు. అలాగే ఇ-ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులు, డేటా డ్రివెన్ గవర్నెన్స్ వంటి అంశాలపై ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో పథకాల అమలు ఏ విధంగా జరుగుతోంది... కేంద్ర నిధులను ఏ మేరకు వినియోగించారు... వీటికి సంబంధించిన యూసీలు ఆయా శాఖలు ఎంత వరకు జారీ చేశారనే అంశంపై సీఎం సమీక్షించనున్నారు. దీంతోపాటు పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు... వాటిని అమలు చేసే అంశంపై జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సంక్షేమం ద్వారా సాధికారత - సూపర్ సిక్స్ అమలు వంటి అంశాలపై సమీక్షతో తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగియనుంది.
సక్సెస్ స్టోరీస్... బెస్ట్ ప్రాక్టీసెస్
వివిధ జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన జిల్లాల కలెక్టర్లు రెండో రోజైన గురువారం ఉదయం ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. అలాగే స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి వంటి అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు... రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో కీలకమైన రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక చర్చ జరగనుంది. మధ్యాహ్నం నుంచి శాంతి భద్రతలపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోం కార్యదర్శి విశ్వజిత్ సహా వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొననున్నారు. చివరిగా ముఖ్యమంత్రి ఉపన్యాసంతో రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగియనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




