విశాఖ విమానాశ్రయానికి డిమాండ్‌.. 80 విమాన సర్వీసులకు ప్రతిపాదనలు

*ప్రతిపాదనలు పరిశీలిస్తున్న డీజీసీఏ *వివిధ విమాన సంస్థల నుంచి 80 వరకూ ప్రతిపాదనలు *వచ్చే వేసవిలో సేవల్ని అందించేందుకు సమాయత్తం

Samba Siva Rao
Updated on: 3 Feb 2021 9:47 PM IST
విశాఖ విమానాశ్రయానికి డిమాండ్‌..  80 విమాన సర్వీసులకు ప్రతిపాదనలు
X

కొత్తగా 80 విమాన సర్వీసులకు ప్రతిపాదనలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. అయితే కరోనా వైరస్ సంక్షోభం తర్వాత పరిమితమైన విమానాలు మాత్రనే నింగిలోకి ఎగురుతున్నాయి. వేసవి కాలంలో ఈ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. వచ్చే వేసవిలో సేవల్ని అందించేందుకు వివిధ విమాన సంస్థల నుంచి 80 వరకూ ప్రతిపాదనలు రావడంతో విశాఖ విమానాశ్రయానికి డిమాండ్‌ పెరుగుతోంది.

విశాఖలో విమానాశ్రయానికి డిమాండ్‌ పెరుగుతోంది. వచ్చే వేసవిలో సేవల్ని అందించేందుకు వివిధ విమాన సంస్థలు ముందుకు వచ్చాయి. దాదాపు 80 వరకూ ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం విమానాశ్రయం పూర్తిగా నేవీ ఆధీనంలోనే ఉండటంతో వారిచ్చిన ఖాళీ సమయాల్లోనే ఈ విమానాల్ని నడపాలి. ఇది వరకే ఈ ప్రతిపాదనలపై నేవీ ఉన్నతాధికారులతో చర్చలు నడిచాయి. ఖాళీ స్లాట్‌ల ఆధారంగా అనువైన సమయాల్ని డీజీసీఏకు విమానాశ్రయ డైరెక్టర్‌ రాజకిషోర్‌ నివేదించారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ విమానాలపై ఇంకా నిషేధం కొనసాగుతోంది. ఎప్పటి నుంచి ఆ విమానాలు మొదలవుతాయనే అంశంపై స్పష్టత లేదు. దీంతో ఇప్పుడొచ్చిన వేసవి ప్రతిపాదనలన్నీ కేవలం దేశీయంగా నడిపేందుకే వచ్చాయి. విశాఖ నుంచి నూతనంగా కర్నూలు, నాగ్‌పూర్‌కు రోజువారీ సర్వీసుల్ని ఇండిగో సంస్థ ప్రతిపాదించింది.

ఇక ఉడాన్‌ పథకంలో భాగంగా తక్కువ టికెట్‌ ధరలతో కర్నూలుకు నడిపే విమానాన్ని ఇది వరకే ఇండిగో ప్రకటించింది. విశాఖ-రాజమండ్రి విమాన సర్వీసును మార్చి 28 నుంచి సంస్థ పునరుద్ధరించనుందని డైరెక్టర్‌ రాజకిషోర్‌ తెలిపారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story