32 శాతం పెరిగిన ధాన్యం కొనుగోళ్లు

32 శాతం పెరిగిన ధాన్యం కొనుగోళ్లు
x
Highlights

గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ధాన్యం కొనుగోళ్లు 32 శాతం పెరిగాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

అమరావతి : గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ధాన్యం కొనుగోళ్లు 32 శాతం పెరిగాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఇప్పటివరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని తెలిపారు. రైతుల సౌకర్యార్థం ఈ కేంద్రాల్లో 7.89 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు రూ.4,085 కోట్లు చెల్లించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. చెల్లింపులు వేగంగా జరపడంపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంకు ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖకు సిఎం దిశానిర్దేశం చేశారు. శాస్త్రీయ విధా నంలో పంటల సాగు ప్రణాళిక, వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించాలని తద్వారా రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు

ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లతో పాటు వివిధ పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు, వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 32 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్టు తెలియచేశారు. దీనిపై స్పందించిన సిఎం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్డీఎ ప్రజాప్రతినిధులు అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రాగులు, జొన్న, సజ్జ లాంటి చిరు ధాన్యాల పంటలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు.

సీసీఐ తీరుపై సీఎం అసహనం

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన స్లాట్లు కేటాయింపు, ఇతర సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పత్తి కొనుగోళ్లలో సమస్యల్ని సృష్టించొద్దని సిసిఐకి సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. మిర్చి లాంటి పంటలకు మార్కెట్ కల్పించే విషయంలో వివిధ విశ్లేషణా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 45,420 హెక్టార్లలో సుబాబుల్ సాగైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మార్కెట్ కు అనుగుణంగా సుబాబుల్ రైతులకు ధర దక్కేలా చూడాలని సిఎం సూచనలు జారీ చేశారు. అరటి, నిమ్మ లాంటి ఉద్యాన పంటలకు సంబంధించి కొనుగోలు దారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కనీస మద్దతు ధర దక్కేలా వాణిజ్య పంటల హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానాన్ని పాటించాలని.. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories