NTR Bharosa Pensions: పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక రోజు ముందుగానే పింఛన్..!!
NTR Bharosa Pensions: పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక రోజు ముందుగానే పింఛన్..!!
NTR Bharosa Pensions: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్ డిసెంబర్ 31వ తేదీనే లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యూ ఇయర్ సందర్భంగా లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెన్షన్ల పంపిణీపై ముందస్తు నిర్ణయం తీసుకుంది. జనవరి 1న న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే ఉండటంతో.. ఆ రోజు పెన్షన్ల పంపిణీలో ఆలస్యం జరగకుండా డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వికలాంగులు, విధవలు సహా అన్ని వర్గాల పెన్షన్ లబ్ధిదారులు సకాలంలో తమ పెన్షన్ పొందే అవకాశం కలుగుతుంది.
ఈ నిర్ణయాన్ని సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30వ తేదీ నాటికే అవసరమైన నగదు సిద్ధం చేసుకోవాలని సూచించింది. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా బ్యాంకులతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా నగదు లభ్యత విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బ్యాంకులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
అలాగే.. ఏవైనా కారణాల వల్ల డిసెంబర్ 31న పెన్షన్ అందని లబ్ధిదారుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. మిగిలిపోయిన పెన్షన్లను జనవరి 2వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ఒక్క లబ్ధిదారుడూ పెన్షన్ కోల్పోకుండా చూసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయం పెన్షన్లపై ఆధారపడే లక్షలాది కుటుంబాలకు కొత్త సంవత్సరానికి ముందే ఊరటనిస్తుంది. పండుగ వాతావరణంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ చర్య ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ ముందస్తు చర్యపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




