
మిషన్ వాత్సల్య అంటే ఏమిటి? అనాథ పిల్లలు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Mission Vatsalya : ఆంధ్రప్రదేశ్లోని అనాథ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న మిషన్ వాత్సల్య పథకం ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా ఈ సాయం అందుతోంది. కేవలం తిండి, బట్టలకే పరిమితం కాకుండా, వారు ఉన్నత చదువులు చదువుకుని సమాజంలో గౌరవంగా బతికేలా ప్రతి నెలా కొంత నగదును ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం ముఖ్యంగా తీవ్రవాద హింస, సరిహద్దు కాల్పులు, లేదా ఇతర కారణాల వల్ల అనాథలైన పిల్లలకు వరంగా మారింది.
ఈ పథకం కింద చదువుకునే స్థాయిని బట్టి ప్రతి నెలా ఆర్థిక సాయం అందుతుంది. పదో తరగతి చదువుతున్న వారు, లేదా ఐటీఐ, డిప్లొమా, కంప్యూటర్ కోర్సులు చేసే విద్యార్థులకు నెలకు రూ.1,250 అందిస్తారు. అదే డిగ్రీ లేదా పీజీ చదివే వారికైతే నెలకు రూ.1,500 సాయం అందుతుంది. ఇక అత్యంత ఖరీదైన చదువులైన మెడికల్, ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే అనాథ పిల్లలకు నెలకు రూ.1,750 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సాయం గరిష్టంగా 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా వారి చదువు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది.
ఈ పథకానికి అర్హులవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే పిల్లలు ఖచ్చితంగా అనాథలై ఉండాలి లేదా నిరాశ్రయులై ఉండాలి. వారు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి. ముఖ్యంగా టెర్రరిస్ట్ హింస, సరిహద్దు కాల్పులు, వామపక్ష తీవ్రవాదం వంటి సంఘటనల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అనాథ పిల్లల విద్య మరియు సంరక్షణను పర్యవేక్షించే మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ లబ్ధిదారుల గుర్తింపు జరుగుతుంది.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా తమ పరిధిలోని ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలయాలను సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు చేసుకున్న తర్వాత, గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. పిల్లల స్థితిగతులను బట్టి వారు నిజంగా అనాథలని తేలితేనే పథకానికి ఎంపిక చేస్తారు. దీనికోసం అనాథ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు వారు చదువుతున్న విద్యాసంస్థ నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలు ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశం కలుగుతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




