రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Siramdasu Nagarjuna
Published on: 17 Dec 2025 11:41 AM IST
రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
X

అమరావతి: జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘వ్యవస్థలో ఉండే లోపాలను గుర్తించి వాటిని వినియోగించి పని నుంచి తప్పించుకునే పరిస్థితులు వచ్చాయి. రెవన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఫైళ్లను పరిష్కరించుకుండా తమ వద్ద నుంచి వేరే వారికి పంపించేస్తున్నారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి. డేటా డ్రివెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం. కానీ, మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుంది.’’ అని చెప్పారు.

‘‘అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలి. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలి. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నాం. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యం. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించింది. సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. వెనుకబడిన వర్గాలను ముందుకు తేవటానికే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0, స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. అభివృద్ధి ఒకవైపు... సంక్షేమం మరోవైపు జరుగుతోంది.’’ అని సీఎం వివరించారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story