వైసీపీలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టయింది. చాలా చోట్ల సిట్టింగ్ సీట్లను మార్చేస్తున్న జగన్.. ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ...
వైసీపీలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టయింది. చాలా చోట్ల సిట్టింగ్ సీట్లను మార్చేస్తున్న జగన్.. ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ సీటును కూడా మాజీ ఎమ్మెల్యేకు ఇస్తున్నారట. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ తరుపున జంకే వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పనితీరుపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం అంతంత మాత్రంగానే ఉంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి ఈ దఫా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వాస్తవానికి 2014 ఎన్నికలప్పుడే జంకే, కేపీ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకున్న జంకే.. తనకు మద్దతు ఇవ్వాలని కొండారెడ్డిని కోరారు. మొదట్లో ఇందుకు కొండారెడ్డి ఒప్పుకోకపోయినా.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనలతో జంకేకు మద్దతు ఇచ్చేందుకు కొండారెడ్డి ఒప్పుకున్నారు. అదే సమయంలో 2019 లో మాత్రం తన కొడుకు నాగార్జునరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కొండారెడ్డి కండిషన్ పెట్టారు.
ఈ క్రమంలో జంకే వెంకటరెడ్డి, కొండారెడ్డి, హనుమారెడ్డి, నాగార్జునరెడ్డి లపై సర్వే నిర్వహించింది ప్రశాంత్ కిషోర్ టీం.. అందులో జంకే, కేపీలకు ఎక్కువశాతం మద్దతు పలికారు. జంకే మీద పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా.. ఆయన అతి సున్నిత మనసత్త్వం కారణంగా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తేలింది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయి ఉండి కూడా సర్పంచ్ కంటే దారుణంగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. పైగా జంకే వద్దకు కార్యకర్త ఎవరైనా పనికోసం వెళితే అసంతృప్తిగా తిరిగి రావలసిందేనని పీకే సర్వేలో తేలిందట.
మరోవైపు కేపీ కొండారెడ్డి గత పదేళ్లనుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పేరుకు ఆయన మాజీ అయినా పనులు చక్కదిద్దడంలో ముందుంటారు. కార్యకర్తలు ఎవరైనా ఆయన వద్దకు వెళితే ఖచ్చితంగా పని జరగాల్సిందేనని అంటున్నారు. అయితే 2014 ఎన్నికల అనంతరం మూడేళ్లపాటు కార్యకర్తలను పట్టించుకోకుండా ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు పలుమార్లు టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నించారన్న అపవాదు ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. పదేళ్లు గడుస్తున్నా ఆయన క్యాడర్ మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఇప్పటికి ఆయనకు మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉందని పీకే టీం గ్రహించింది. ఈసారి గనక ఆయనకే టిక్కెట్ ఇస్తే ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ మరింత బలపడుతుందని పీకే టీం అంచనా వేస్తోంది. అయితే కేపీకి టిక్కెట్ ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా ఉన్నా ఆయన మాత్రం తన కుమారుడు నాగార్జునరెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారట..
అటు నాగార్జునరెడ్డి కూడా గత ఐదేళ్ళుగా టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ మాచర్లలో విద్యా సంస్థల బాధ్యత చూసుకుంటున్నారు. సౌమ్యుడిగా పేరొందిన నాగార్జునరెడ్డి.. మొహమాటం కారణంగా ఎవరికీ అందుబాటులో ఉండరని అంటుంటారు. చాలా రోజులుగా టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారే కానీ.. పార్టీ బలోపేతం కోసం ఏ రోజు పనిచేయలేదనే విమర్శ ఎదురవుతోంది. పైగా కార్యకర్తలు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించరని పీకే టీం పసిగట్టింది. ఏదో అడపా దడపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారే తప్ప టిక్కెట్ పై ఖచ్చితమైన హామీ వస్తేనే నియోజకవర్గంలో పూర్తిస్థాయి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాలని ఆయన ఆలోచనట. ఈ కారణాలతో ఆయనవైపు మొగ్గుచూపించడం లేదట వైసీపీ.
ఇక మార్కాపురం రేసులో ఉన్న మరో నేత వెన్నా హనుమారెడ్డి. ఒక్కసారి కూడా పోటీ చెయ్యకుండానే ఆయనపై కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆయనకు గనక టిక్కెట్ ఇస్తే టీడీపీ నెత్తిన పాలు పోసినట్టేనని అంటుంటారు. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదన్న కారణంగా ఆయన టీడీపీకి లోలోపల సపోర్ట్ చేశారనే ఆరోపణలతో సతమతమవుతున్నారు. పైగా ఆయన విద్యా సంస్థల్లో ఫీజుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పీకే టీం కనీసం పరిగణంలోకి కూడా తీసుకోలేదట. దీంతో ఎలాగో తనకు టిక్కెట్ రాదని ఫిక్స్ అయిన హనుమారెడ్డి.. కొండారెడ్డికి మద్దతు పలుకుతున్నారట.
ఇదిలావుంటే రకరకాల విషయాలను పరిశీలించిన వైసీపీ అధిష్టానం మార్కాపురంలో కేపీ కొండారెడ్డి అభ్యర్ధిత్వాన్నే కన్ఫామ్ చెయ్యాలని అనుకుంటోదట. ఇప్పటికే టిక్కెట్ ఇస్తున్నట్టు కొండారెడ్డికి స్పష్టమైన సమాచారం అందినట్టు తెలుస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire