పంచాయతీ ఎన్నికల్లో తారా స్థాయిలో పోటీ

* పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఉత్సాహం * ఎమ్మెల్యే సుధాకర్, కోట్ల హర్ష మధ్య విభేదాలతో.. * ఒకే పార్టీ నుంచి అధికంగా అభ్యర్థులు

Sandeep Eggoju
Published on: 2 Feb 2021 7:46 AM IST
Local Body Elections Competition in Andhra Pradesh
X

Representational Image

రాజకీయంగా ఎదగాలంటే స్థానిక ఎన్నికలలో పోటీ చేసి నెగ్గుకు రావాలి అదే భవిష్యత్ రాజకీయ ఎదుగుదలకు పునాది అవుతుంది. అందుకే పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. అయితే కర్నూలు జిల్లాలో పోటీదారులు పెరగటం, ఎంత చెప్పినా రాజీకి రాక పోవటం ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది.

రాజకీయాల్లో కర్నూలు జిల్లా స్థానం ప్రత్యేకం. జిల్లాలో ఫ్యామిలీ రాజకీయాలు ఓ ఎత్తు అయితే రాజకీయంగా ఎదగాలనే ఆరాటం మరో ఎత్తు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ తార స్థాయిలో ఉంది. కోడుమూరు నియోజకవర్గం పరిధిలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం తీస్తున్నారు. అభ్యర్థుల్లో వైసీపీ, టీడీపీ నేతలే ఎక్కువగా వున్నారు. అయితే మాకంటూ మాకంటూ అభ్యర్థులు అవకాశాల కోసం పట్టుబట్టుకు కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి జిల్లాలోని అగ్ర నేతలకు తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్, కోట్ల హర్ష మధ్య విభేదాలు ఉండటంతో వీరిద్దరి అనుచరులు పంచాయతీ ఎన్నికలకు పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు. తామే పోటీ చేస్తామని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. పార్టీ అధినేతలు ఎంత రాజీ యత్నం చేసినా పోటీదారులు వెనక్కి తగ్గటం లేదు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో మొదలైన ఈ ఆధిపత్య పోరాటం పంచాయతీ ఎన్నికలు వచ్చే సరికి తారాస్థాయికి చేరింది.

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధాకర్ కోట్ల హర్షను ఆహ్వానించలేదు. హర్ష ప్రమేయం లేకుండానే ఆయన స్వగ్రామం లద్దగిరిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి చేయాలని ప్రయత్నం ఉద్రిక్తతకు కూడా దారితీసింది. అయితే దీనికి ఎమ్మెల్యే సుధాకర్ కారణమని కోట్ల హర్ష వర్గం ఆరోపిస్తోంది. మరో వైపు కోట్ల హర్ష వ్యతిరేకులను ఎమ్మెల్యే సుధాకర్ పార్టీలో చేర్చుకుని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కోట్ల వర్గం గుర్రుగా వుంది. ఈ వివాదం పంచాయతీ ఎన్నికల్లో ఇరు వర్గాల పోటీదారులను పెంచింది. దీంతో టీడీపీకి పరిస్థితి అనుకూలంగా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ వి‌శ్లేషకులు.

ఇటు టీడీపీలో కోట్ల సూర్య, విష్ణు వర్గంలోనూ పోటీ నెలకొంది. అయితే అగ్ర నేతలు ఓ అవగాహనకు వచ్చి బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇదే జరిగితే డీలా పడిన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక రెండు పార్టీల నుంచి అభ్యర్థులు భారీగా పోటీ చేస్తుండటంతో కోడుమూరు నియోజకవర్గంలో ఏకగ్రీవాలకు ఛాన్స్ లేకపోగా పోటీ తప్పనిసరైంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story