అనంతపురం జిల్లాలో భూ పట్టాల పంపిణీ వివాదం

* ఓ రైతు భూమిలో పట్టాలు పంపిణీ చేసిన అధికారులు * ఉరవకొండ మండలం లత్తవరంలో సర్వే నెం.253-1లో.. * నలుగురు అన్నదమ్ములకు కలిపి 3.6 ఎకరాల భూమి

Sandeep Eggoju
Published on: 31 Dec 2020 10:40 AM IST
అనంతపురం జిల్లాలో భూ పట్టాల పంపిణీ వివాదం
X

అనంతపురం జిల్లాలో భూ పట్టాల పంపిణీ వివాదానికి దారి తీసింది. ఉరవకొండ మండలం లత్తవరంకు చెందిన ఓ రైతు భూమిలో పట్టాలను పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది. లత్తవరంలో సర్వే నెంబర్‌ 253-1లో ఓ దళిత రైతు కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములకు 3.6 ఎకరాల భూమి ఉంది. భూ పంపిణీలో భాగంగా గతంలో ప్రభుత్వం భూమిని అందించింది. అయితే ఇళ్లస్థలాలకు ప్రభుత్వం తమ భూమిని సేకరిస్తోందని తెలుసుకున్న అన్నదమ్ముల్లో ఒక్కరైన ఆనంద్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడిది కాకుండా మిగిలిన ముగ్గురు అన్నదమ్ముల పొలాన్ని ప్రభుత్వం 23లక్షల 93వేలకు కొనుగోలు చేసి లే అవుట్‌ను సిద్ధం చేసింది.

అధికారులు భూ పంపిణీ చేపట్టిన విషయం తెలుసుకున్న ఆనంద్‌ తన అన్నదమ్ముల మధ్య పూర్తిస్థాయిలో భాగ పరిష్కారం కాలేదని, దీనిపై కోర్టును ఆశ్రయించామని ఇళ్ల స్థలాలు ఎలా పంపిణీ చేస్తారంటూ అధికారులను ప్రశ్నించాడు. తహశీల్దార్‌, పోలీసులతో వాదనకు దిగి తీవ్ర పదజాలంతో దూషించాడు. అవినీతికి పాల్పడి లే అవుట్‌ చేశారంటూ ఆరోపించాడు.

ఆగ్రహానికి గురైన వైసీపీ నేతలు, కార్యకర్తలు రైతు ఆనంద్‌తో పాటు కుమారుడు, కుమార్తెపై దాడికి పాల్పడ్డారు. అధికారులతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ దూషించారు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంబడించి మరీ కొట్టారు. చివరికి తలదాచుకునేందుకు ఆటో ఎక్కినా వదల్లేదు. ఆటోను చుట్టుముట్టి దాడి చేశారు. పోలీసులు వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించినా ఏ మాత్రం బెదరకుండా దాడి చేస్తూనే ఉన్నారు వైసీసీ వర్గం వారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story