కమల సేన కాపురంలో అప్పుడే కలతలా.. కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ వెళితే కూటమి ముక్కలేనా?

Arun Chilukuri
Updated on: 15 Feb 2020 1:46 PM IST
కమల సేన కాపురంలో అప్పుడే కలతలా.. కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ వెళితే కూటమి ముక్కలేనా?
X
కమల సేన కాపురంలో అప్పుడే కలతలా

జనసేన-కమలం కాపురం కలహాల కాపురంగా మారుతోందా? స్టేట్‌లో వైసీపీతో బీజేపీ వైరం, సెంటర్‌లో స్నేహం, జనసేన అధినేతలో అనుమానపు బీజాలు నాటుతోందా? తాను ఆటలో అరటిపండులా మారిపోతున్నానని పవన్‌ మథనపడుతున్నారట? ఢిల్లీకి జగన్‌ వరుస పర్యటనలు, కేంద్ర పెద్దలతో సుదీర్ఘ మంతనాలతో, జనసేనవర్గాల్లో సందేహాలు పెరుగుతున్నాయా? కలిసికట్టుగా సాగుదామని ప్రమాణం చేసి, ఇంతవరకూ పట్టాలెక్కని కమల సేనలో అసలేం జరుగుతోంది?

వైసీపీతో బీజేపీ తెరవెనక దోస్తీ చేస్తోందని జనసేన అనుమానమా? కలిసి కాపురం మొదలెట్టకముందే సందేహాలతో సతమతమా? ఇంకా ఉమ్మడి కార్యక్రమం పట్టాలెక్కకపోవడానికి అదే కారణమా? జనసేన-కమలం మధ్య అసలేం జరుగుతోంది?

ఆంధ‌్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కలిసి పని చెయ్యాలని, జగన్‌ ప్రభుత్వంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, మొన్నామధ్య జగసేన-బీజేపీలు మాట్లాడుకున్నాయి. కానీ ఇంతవరకూ ఉమ్మడి కార్యక్రమం పట్టాలెక్కలేదు. అటు బీజేపీ అధిష్టానం మాత్రం, సీఎం జగన్‌తోనూ, వైసీపీ ఎంపీలతోనూ క్లోజ్‌గా మూవ్‌ కావడం, వరుసగా జగన్‌ ఢిల్లీ పర్యటనలు, జనసేన అధినేతలో అనుమానపు బీజాలు నాటుతున్నాయి. కాపురం మొదలెట్టకముందే, కమలసేన సంసారంలో కలతలు మొదలయ్యాయి. అసలు ముందుముందు సంసార నావ సాగుతుందా నడి సంద్రంలో మునిగిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ఇటు ఏపీ, అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు అలాంటి సందేహాలకు కారణమవుతున్నాయట.

జగన్‌ అదేపనిగా ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటి అవుతుండటం, కేంద్రమంత్రులతోనూ సమావేశాలు అవుతుండటం, పవన్‌ సహించలేకపోతున్నారట. ఒకవైపు జగన్‌ ప్రభుత్వంతో పోరాడదాం అంటూనే, మరోవైపు అదే జగన్‌తో క్లోజ్‌గా మూవ్‌ అవడం అస్సలు అర్థంకావడం లేదట. పవన్‌ను బీజేపీ ఆటలో అరటి పండు చేస్తోందని జనసేన సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారట.

వాస్తవానికి జగన్‌తో వైరాన్ని బీజేపీ కోరుకోవడం లేదు. దినివల్ల దానికి ఇప్పటికిప్పడు లాభం లేదు. ఎందుకంటే, అనేక బిల్లుల విషయంలో పార్లమెంట్‌లో బీజేపీకి వైసీపీ సహకరిస్తోంది. ముఖ్యంగా తనకు బలం తక్కువగా వున్న రాజ్యసభలో. అలాగే ఏపీలో ఇప్పటికిప్పుడు వైసీపీకి ప్రత్నాయ్నాయంగా, టీడీపీ, జనసేనలను కాదని, బీజేపీ ఎదగడం అసాధ్యం. వచ్చే 15 ఏళ్లలో కూడా బీజేపీకి ఏపీలో అంతస్కోపుండదన్నది కమలం పెద్దల ఆలోచన. అటువంటప్పుడు జగన్‌తో వైరమెందుకని ఆలోచిస్తోందట కాషాయ అధిష్టానం. అందుకే రాజధాని విష‍యంలో, కేంద్రంతో ఏదో చేయిస్తానని మొదట్లో అన్న పవన్, ఆ తర్వాత అది కేంద్రం పరిధిలోనిది కాదని మెత్తబడాల్సి వచ్చింది. ఇలా పరోక్షంగా వైసీపీకి బీజేపీ సహకరిస్తున్నప్పుడు, తన పోరాటం దేనికని, మథనపడుతున్నారట పవన్.

అంతేకాదు, పవన్‌కు మింగుడపని మరో ఊహాగానం ఏంటంటే, త్వరలో కేంద్రమంత్రివర్గంలో వైసీపీ చేరబోతోందట. విజయసాయి రెడ్డితో పాటు మరొకరికి కేంద్ర మంత్ర పదవి రావడం ఖాయమట. జగన్‌ తాజా ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపైనా చర్చ జరిగిందట. ఇదే జరిగితే జనసేన కచ్చితంగా బీజేపీకి గుడ్ బై చెప్పక తప్పదు. రానున్న కాలంలో, ఈ అంచనాలు, ఊహాగానాలు నిజంగా నిజమైతే, పవన్‌ భవిష్యత్‌ కార్యాచరణ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story