Summer Heat: ఠారెత్తిస్తున్న ఎండలు..కూలర్ల, ఫ్రిజ్‌కు భలే గిరాకీ

Summer Heat: రోజు రోజుకు భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

Samba Siva Rao
Updated on: 17 March 2021 10:18 AM IST
summer heat waves
X
సమ్మర్ హీట్ (ఇమేజ్ సోర్స్Thehansindia )

Summer Heat: రోజు రోజుకు భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. 24 గంటల పాటు ఇవి తిరుగుతూనే ఉంటున్నాయి. విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయం ఏర్పడినా.. తట్టుకోలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలతో పాటు విద్యుత్ వినియోగం కూడా పెరిగింది.

వారం రోజులుగా సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీలకు తగ్గడం లేదు. రాత్రి వేళ్లల్లోనూ 29 డిగ్రీలు నమోదవుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు కూలర్లు వాడుతుండగా, ఆర్థికంగా స్థిరపడ్డవారు ఏసీలను ఉపయోగిస్తున్నారు. ఫ్యాన్‌ల విషయం ఇక చెప్పనక్కర్లేదు. వ్యాపార వాణిజ్య దుకాణాల్లో గతంలో ఫ్యాన్లు నడిచేవి. ఉష్ణోగ్రతలు తీవ్రమవడంతో దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలోనూ కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు.

పెరిగిన ఎండలకు ప్రజలు కూలర్ల కొనుగోళ్లవైపు పరుగులు పెడుతున్నారు. భానుడి వేడి తట్టుకోవడం కష్టతరంగా మారిందంటున్నారు. ఈ ఏడాది కూలర్లు, ఏసీల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఇటు వేడి తట్టుకోలేక వచ్చిన వారికి రేట్ల సెగ తగలడంతో తిరిగి ఇంటిబాటపడుతున్నారు సామాన్యులు. ఈ ఏడాది ఏకంగా 60 శాతం రేట్లు పెరిగాయని వ్యాపారలు చెబుతున్నారు. ఏసీలు కూలర్ల ధరలు పెరగడంతో వినియోగదారులు రావడంలేదంటున్నారు వ్యాపారులు.

నగరంలోని బాలానగర్‌ లాంటి ఏరియాల్లో కొందరు లోకల్‌ బ్రాండ్లను తయారుచేస్తూ వినయోగదారులకు అంటగడుతున్నారు. అవి కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయని వ్యాపారులే స్పష్టంగా చెబుతున్నారు. బ్రాండెడ్‌ కంపెనీల కూలర్లు తీసుకుంటే అధిక ధరలు ఉండటంతో ప్రజలు వాటివైపు చూడటం లేదు. దీంతో లోకల్‌ బ్రాండ్‌లు అధికంగా సేల్‌ అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది కొవిడ్ కారణంగా కొనుగోళ్లు తగ్గి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తుండటంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు, ఐసోలేటర్లపై తీవ్రభారం పడుతోంది. ఎండ వేడిమికితోడు వినియోగం ఎక్కువై ట్రాన్స్ ‌ఫార్మర్లపై భారం పడుతుండటంతో ఇబ్బందిగా మారుతోంది.

ప్రస్తుతం ఎండ వేడిని తట్టుకోలేక నగరంలోని ప్రజలు ఏసీలు, కూలర్లు అత్యధికంగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్‌ వినియోగం అధికం అయ్యింది. దీంతో ప్రస్తుతం విద్యుత్‌ అధికారులు సైతం అలర్ట్‌ అయ్యారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story