పోష్-2013 చట్టంపై ప్రతి విద్యార్థినికి అవగాహన అవసరం

లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మహిళలకు చట్టాలపై అవగాహన అత్యంత కీలకం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ చెప్పారు. భయం వల్ల మౌనం పాటించకుండా ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Siramdasu Nagarjuna
Published on: 17 Dec 2025 5:33 PM IST
పోష్-2013 చట్టంపై ప్రతి విద్యార్థినికి అవగాహన అవసరం
X

శ్రీకాకుళం: లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మహిళలకు చట్టాలపై అవగాహన అత్యంత కీలకం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ చెప్పారు. భయం వల్ల మౌనం పాటించకుండా ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలు, బాలికలు గౌరవం, భద్రతతో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కని అన్నారు. ఎచ్చెర్ల ఐఐఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పోష్, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. లైంగిక వేధింపులు అనేవి కేవలం శారీరకమే కాకుండా, మాటలు, సంకేతాలు, అసభ్య వ్యాఖ్యలు, మెసేజ్‌లు, సోషల్ మీడియా ద్వారా కూడా జరుగుతాయని విద్యార్థులకు వివరించారు.

గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో POSH చట్టం అమలులోకి వచ్చిందని, ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు తప్పనిసరని, కమిటీలు బలంగా పనిచేస్తేనే భయరహిత వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

ఫిర్యాదు చేసిన మహిళపై ఒత్తిడి, బెదిరింపులు, ప్రతీకార చర్యలు తీసుకోవడం చట్టరీత్యా నేరమని, మహిళా కమిషన్ ఫిర్యాదుదారుల గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, విద్యార్థులు అవగాహన పొందేలా సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇబ్బంది ఏదైనా ఉంటే తప్పకుండా తెలియజేయాలని, మహిళా కమిషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ చైర్మన్, ఎచ్చెర్ల ఐఐఐటి ఛాన్సలర్ ప్రొఫెసర్ కొత్తా మధుమూర్తి, ఐఐఐటి డైరెక్టర్ కె. బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story