మన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు

Eluru District Malaria, Fever, Dengue Diseases Are Fearing
x

మన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు

Highlights

Elluru District: విజృంభిస్తున్న మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో గిరిజనుల విలవిల

Elluru District: మన్యం మంచం పట్టింది. వర్షాలు కురుస్తుండటంతో ఆదివాసీలు అనారోగ్యం పాలవుతున్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాలను మలేరియా జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, డెంగీలతో పాటు సాధారణ జ్వరాలు విజృంభిస్తున్నాయి.

ప్రతి ఏటా వందల సంఖ్యలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమెళ్లి, పోలవరం మండలాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం రోజుకు పదుల సంఖ్యలో సీజనల్ జ్వరాలు వస్తున్నాయి. జ్వరాలతో అనేక మంది మృత్యు వాత పడుతున్నారు. ప్రతి ఏడాది వర్షాలు పడ్డాక ముందుగా వైరల్ ఫీవర్లతో ప్రారంభమై ఒక్కసారిగా మలేరియా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే బుట్టాయగూడెం, జీలుగుమెళ్లి, పోలవరం ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి పోయాయి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అనేకమంది గిరిజనులు చికిత్స పొందుతున్నారు.

ప్రతి ఏటా వేసవిలో గ్రామాల్లో దోమలు వృద్ధి చెందకుండా మలేరియా నివారణ మందు పిచికారి చేయాల్సి వుంది. అయితే ఇప్పటికీ పిచికారి చేయక పోవడంతో గ్రామాల్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. జ్వరాలతో గిరిజనులు స్థానిక అర్ఎంపీ లను ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజూ మెడికల్ క్యాంపు లు నిర్వహించాల్సిన అధికారులు గ్రామాల్లో కానరాకపోవడంతో గిరిజనులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

అయితే అధికారులు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెబుతున్నారు. ప్రతి ఏటా దోమలు కుట్టకుండా దోమ తెరలు పంపిణీ చేసే వారని... ఈ ఏడాది ఇప్పటివరకు పంపిణీ జరగలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి. మన్యం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories