Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు * కాసేపట్లో కరోనాపై సబ్‌ కమిటీ, మంత్రులతో సీఎం సమీక్ష

Sandeep Eggoju
Updated on: 17 May 2021 11:51 AM IST
Corona Cases Hiking in Andhra Pradesh
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం 

Corona: ఏపీలో కరోనా విస్తృతిని అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ రేపటితో ముగియనుండటంతో.... తదుపరి చర్యల కోసం సీఎం జగన్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో కరోనాపై సబ్‌ కమిటీ, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వణికిస్తోంది. అయితే కరోనా కట్టడికి కర్ఫ్యూని పొడిగించడమా? లేక, సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడమా అనే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారు.

ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 18 గంటలపాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నారు. అత్యవసర మెడికల్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం అదుపులోకి రాలేదు సరికదా.. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. మధ్యాహ్నాం 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం అవసరం లేకున్నా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇవాళ కట్టడికి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది.

ప్రస్తుత పరిస్థితిలో కర్ఫ్యూ కన్నా.. లాక్‌డౌనే ఉత్తమమని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్‌కు కూడా అధికారులు ఇదే విషయం చెప్పినట్టు సమాచారం.. సంపూర్ణ లాక్‌డౌన్ లేకుంటే కేసులు అదుపులోకి రావడం కష్టమని భావిస్తున్నారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఏపీలో భయానకంగా మారుతుంది. పెరుగుతున్న కేసులు, ఔషధాల కొరత ఇవన్నీ ఒకటైతే.. మరోపక్క వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని పరిశీలించి... అధికారులు అందించే నివేదికను బట్టి సీఎం జగన్‌ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story