
విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఫిన్ టెక్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కేపాసిటీతో ఈ తాత్కాలిక క్యాంపస్ ను ఏర్పాటుచేశారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఫిన్ టెక్ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనున్నారు. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించనుంది.
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్
అనంతరం మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ ఉద్యోగులతో సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీరంతా ఆంధ్రప్రదేశ్ ను గర్వపడే విధంగా చేయాలి. యువతే టార్చ్ బేరర్స్. కష్టపడి జీవితంలో విజయం సాధించాలి. ఇవి ఎంతో ఉద్వేగభరిత క్షణాలు. గతేడాది జనవరి 23న రవిని కలిశాను. ఏడాదిలోనే కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఇప్పుడు యువత చరిత్రకు సాక్షులుగా నిలిచారు. భవిష్యత్ లో విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సూర్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల నారాయణన్, వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజ్రా, ఎంపీ శ్రీ భరత్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




