చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పోరేట్లకు మేలు : బొత్స

చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పోరేట్లకు మేలు : బొత్స
x
Highlights

నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినా కార్పోరేట్‌ సంస్థలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని, ఇప్పుడు కూడా కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో అదే పని చేస్తున్నారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.

విజయనగరం: నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినా కార్పోరేట్‌ సంస్థలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని, ఇప్పుడు కూడా కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో అదే పని చేస్తున్నారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు, ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో ఏడింటిని పూర్తి చేశారని ఆయన గుర్తు చేశారు. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా మొదలయ్యాయన్న ఆయన, వాటితో సహా మొత్తం 10 కొత్త మెడికల్‌ కాలేజీలను టీడీపీ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందని, కోటి సంతకాల కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. ఈనెల 17న గవర్నర్‌ను కలుస్తున్న జగన్, వాటన్నింటినీ సమర్పిస్తారని వెల్లడించారు.

ప్రైవేటు యాజమాన్యంలో అలా సేవలందుతాయా?

‘‘ఒక సామాన్యుడు విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్తే, అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుతాయో, అదే నిరుపేద పక్కనే ఉన్న గీతం, లేదా మరే ఇతర ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే, అవే వైద్య సేవలు ఉచితంగా అందుతాయా?. అదే ప్రభుత్వం, ప్రైవేటుకు మధ్య ఉన్న తేడా. సామాన్యులకు కూడా చేరువలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందేలా జగన్‌ కొత్త మెడికల్‌ కాలేజీలు కడితే, ఇప్పుడు సీఎం చంద్రబాబు పీపీపీ పేరుతో వాటిని ప్రైవేటీకరిస్తున్నారు. ఇది అత్యంత దారుణం. హేయం. చంద్రబాబు గారూ, ఇకనైనా దయచేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆపండి. భగవంతుడు మీకు ఒకసారి అవకాశం ఇచ్చాడు. మీకు ఓటేసిన పాపానికి పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్ధితి తీసుకురావడం న్యాయమా?. మళ్లీ చెబుతున్నాం. మేం తిరిగి అధికారంలోకి రాగానే, మెడికల్‌ కాలేజీల పీపీపీని రద్దు చేస్తాం. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవైటీకరిస్తే, వారు కనీసం 30 శాతం వైద్యం కచ్చితంగా ఉచితంగా అందిస్తారా? గీతం, ఎన్నారై వంటి ఆస్పత్రులు ఉచితంగా వైద్యం అందిస్తాయా?’’ అని బొత్స ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories