జగన్‌ అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారు : చంద్రబాబు

జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు.

Samba Siva Rao
Published on: 4 Jan 2021 9:24 AM IST
జగన్‌ అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారు : చంద్రబాబు
X

జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు. వైసీపీ హత్యారాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని చెందన పెదగార్లపాడు తెలుగు దేశం పార్టీ మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హత్యపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో 16 మంది తెలుగుదేశం కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. 20 ఏళ్లు సర్పంచిగా పని చేసిన వ్యక్తిని హత్య చేయడం కిరాతక చర్య అని చంద్రబాబు ధ్వజమెత్తారు. మాజీ సర్పంచి పురంశెట్టి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి(55)ని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, దాచేపల్లిలో అంకులు హత్యలు.. వైసీపీ హత్యా రాజకీయాలకు నిదర్శనాలు అని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ పేట్రేగి పోయిందన్న చంద్రబాబు.. సీఎం జగన్‌ అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైసీపీ నాయకులు శాంతి భద్రతలను అధ:పాతాళానికి దిగజార్చారని విమర్శించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story