YS Viveka: వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

CBI Officials Arrested Accused Devireddy Shiva Shankar Reddy in YS Viveka Reddy Case
x

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు *వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన సీబీఐ

YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్య కేసుకు సంబంధించి వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఇవాళ పులివెందుల కోర్టులో హజరు పర్చనున్నారు.

మరో వైపు శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మూడు రోజుల క్రితమే శస్త్ర చికిత్స చేయించుకున్నారని వైద్యుల నిరంతర పర్యవేక్షణ, యాంటి బయాటిక్స్ అవసరమని సూచించారు. తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అతడిని సీబీఐ అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చింది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరును దస్తగిరి కన్ఫేషన్ స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు. దాంతో విచారణకు రావాలని శివశంకర్ రెడ్డికి ఈనెల 15న సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనని చెప్పారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శివ శంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆపై అతడికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ కోసం సికింద్రాబాద్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో శివశంకర్ రెడ్డిని కడపకు తరలించారు. మరి కాసేపట్లో నిందితుడు కడపకు చేరుకోనున్నారు. శివశంకర్ రెడ్డిని ఈరోజు పులివెందుల కోర్టులో సీబీఐ హాజరుపర్చనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories