AP News: టీవీ సౌండ్ తగ్గించమన్నదే పాపమైంది.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య!

AP News
x

AP News: టీవీ సౌండ్ తగ్గించమన్నదే పాపమైంది.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య!

Highlights

AP News: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘోరం. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపింది భార్య.

AP News: టీవీ శబ్దం విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన మాట వినకుండా పెద్ద సౌండ్‌తో టీవీ చూస్తున్న భార్యను వారించినందుకు, ఆమె ఆగ్రహంతో భర్తను కత్తితో పొడిచి హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపింది.

ఘటన వివరాలిలా ఉన్నాయి..

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడాదిన్నర క్రితం మంగళగిరికి చెందిన క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి వివాహానికి దారితీసింది. క్రాంతికి ఇదివరకే పెళ్లి కాగా, మొదటి భర్త ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అహ్మద్, క్రాంతి కలిసి మంగళగిరిలోని టిడ్కో ఇళ్లలో నివసిస్తున్నారు.

చిన్న గొడవ.. ప్రాణం తీసిన కత్తిపోటు

గురువారం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో క్రాంతి టీవీని పెద్ద శబ్దంతో చూస్తోంది. నీరసంగా ఉండటంతో శబ్దం తగ్గించాలని అహ్మద్ కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన క్రాంతి, ఇంట్లో ఉన్న కత్తితో అహ్మద్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అహ్మద్ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కె.వీరాస్వామి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories