
Pensions: వారందరికీ బిగ్ షాక్.. పింఛన్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన సర్కార్..!!
AP Disabled Pensions Clarity: అర్హులైన ఒక్కరి పింఛనూ తొలగించలేదని స్పష్టం చేశారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. దివ్యాంగుల పింఛన్ల విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్నది పింఛన్ల తొలగింపు ప్రక్రియ కాదని, కేవలం సదరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అర్హతను సరిగా నిర్ధారించుకుని నిజంగా అర్హులైన వారందరికీ పింఛన్లు అందించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.
పింఛన్ల తొలగింపు అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన చాలామందికి పింఛన్లు అందలేదని, అదే సమయంలో అనర్హులు తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందారని విమర్శించారు. దీనివల్ల ప్రభుత్వ ధనం భారీగా వృథా అయ్యిందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశీలన ద్వారా అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
దివ్యాంగుల పింఛన్ల పెంపు విషయంలో జగన్ ప్రభుత్వం మాట తప్పిందని మంత్రి గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ఒక్కరి పింఛనూ తొలగించలేదని, ప్రతీ అర్హుడికి పింఛను అందిస్తున్నామని స్పష్టం చేశారు. దివ్యాంగుల పింఛనును రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని ప్రశంసించారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.50 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వివరించారు. సీఎం చంద్రబాబు దివ్యాంగులకు ఏడు కీలక వరాలు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షం విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పింఛన్లు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జనవరి 1వ తేదీకి బదులు డిసెంబర్ 31వ తేదీన లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా డీఆర్డీఏ పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




