Inter Exams : ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. సిద్ధమైన 1,537 సెంటర్లు..నిమిషం లేటైనా నో ఎంట్రీ

Inter Exams : ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. సిద్ధమైన 1,537 సెంటర్లు..నిమిషం లేటైనా నో ఎంట్రీ
x
Highlights

ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. సిద్ధమైన 1,537 సెంటర్లు..నిమిషం లేటైనా నో ఎంట్రీ

Inter Exams : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయం వచ్చేసింది. రేపటి (సోమవారం, ఫిబ్రవరి 23) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఇంటర్ బోర్డు, ఇటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

పరీక్షల షెడ్యూల్, సమయం

సోమవారం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, మంగళవారం నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే, విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 1,537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు.

పకడ్బందీ నిఘా.. సీసీ కెమెరాల నీడలో..

పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్ష కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలకు అనుమతి ఉండదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పండగల దృష్ట్యా మారిన తేదీలు ఇవే

విద్యార్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హోలీ, రంజాన్ పండగల నేపథ్యంలో కొన్ని పరీక్షల తేదీలను బోర్డు మార్చింది. మార్చి 3న జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్, సివిక్స్ పరీక్షలను మార్చి 4కి మార్చారు. అలాగే మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్లను మార్చి 21కి మార్చారు. మిగిలిన పరీక్షలన్నీ పాత షెడ్యూల్ ప్రకారమే మార్చి 24 వరకు కొనసాగుతాయి.

ఒక్క నిమిషం నిబంధన.. విద్యార్థులకు సూచనలు

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఒక్క నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేయనుంది. ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అందుకే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష గదిలోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అదనపు బస్సులను కూడా నడుపుతోంది. సందేహాల కోసం 1800-425-1531 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories