Free Dialysis in AP: ఏపీలో కిడ్నీ రోగులకు ఊరట.. పెరగనున్న ఉచిత డయాలసిస్ సేవలు

Free Dialysis in AP: ఏపీలో కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ పెంపు
x

Free Dialysis in AP

Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సెషన్లను నెలకు 66 వేలకు పెంచింది. ఉద్దానం తాగునీటి పథకం పూర్తి కావడంతో పాటు, కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

Free Dialysis in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద రోగులకు ఉచిత డయాలసిస్ సేవలను గణనీయంగా పెంచుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. శాసనమండలిలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా కిడ్నీ రోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,504 మంది రోగులు ప్రభుత్వ సాయంతో ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

గతంలో రాష్ట్రంలో డయాలసిస్ సెషన్ల సంఖ్య నెలకు సుమారు 40 వేలుగా ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్యను 66 వేలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. డయాలసిస్ చేయించుకుంటున్న ప్రతి రోగిపై ప్రభుత్వం సంవత్సరానికి సగటున 86 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తోందని సభకు వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Free Dialysis in AP: వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత 20 నెలల్లో రాష్ట్రంలోని వివిధ సెకండరీ గ్రేడ్ ఆసుపత్రుల్లో కొత్తగా 14 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరో 11 కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేశామని చెప్పారు. కిడ్నీ రోగులకు కేవలం ఉచిత డయాలసిస్ మాత్రమే కాకుండా, వారికి అవసరమైన మందులు, నెలవారీ పింఛను కూడా క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అదేవిధంగా, రాష్ట్రంలో డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని, క్లోరినేషన్, బ్లీచింగ్ ప్రక్రియలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. మంచినీటి నాణ్యతను పరీక్షించేందుకు ప్రత్యేకంగా మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను కూడా అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు.

Free Dialysis in AP: మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన తాగునీటి పథకం పూర్తయినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున ఆయన సమాధానమిస్తూ, ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.4,162.95 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా కిడ్నీ వ్యాధుల తీవ్రతను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంపై కూడా సభలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం కేంద్రం కేటాయించిన రూ.13,499 కోట్లలో కేవలం రూ.2,324 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, దీనివల్ల అనేక పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటి కనెక్షన్లు అందించే లక్ష్యంతో రూ.26 వేల కోట్లతో కొత్త ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లు ఆయన వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories