
ట్రాన్స్ఫార్మర్లు రెడీ.. స్తంభాలు రెడీ.. ఏపీ రైతులకు బంపర్ ఆఫర్
AP Farmers : ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. పొలాలకు విద్యుత్ కనెక్షన్ల కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అన్నదాతల నిరీక్షణకు తెరదించుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వేలాది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురించగా, వ్యవసాయ పనులు వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైంది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 46,113 మంది రైతులకు తక్షణమే కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న ఈ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు కూటమి సర్కార్ కంకణం కట్టుకుంది. ఇందుకోసం అవసరమైన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు మరియు ఇతర సామగ్రిని యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని విద్యుత్ శాఖను ఆదేశించింది. మూడు డిస్కంల పరిధిలో ఈ పనులు వేగంగా సాగనున్నాయి.
ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు రూ.250 కోట్ల నిధులను కేటాయించనుంది. ఒక్కో కనెక్షన్ మంజూరుకు సగటున రూ. 50 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పొలాల వద్ద ఏర్పాటు చేసేందుకు 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను సిద్ధం చేస్తున్నారు. వచ్చే రెండు నెలల్లోనే ఈ 46 వేలకు పైగా కనెక్షన్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల వేసవి కాలంలో పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవచ్చని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత గణాంకాల ప్రకారం, ఏపీలో ఇప్పటివరకు మొత్తం 21.84 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 22.30 లక్షలకు చేరుకోనుంది. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోపు కనెక్షన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత మరియు గత ప్రభుత్వ అలసత్వం వల్ల వేల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెండింగ్ ఫైళ్లను దుమ్ము దులిపి, రైతులకు మేలు చేసేలా చర్యలు ప్రారంభించింది.
కేవలం ఈ 46 వేల కనెక్షన్లే కాకుండా, 2025 జనవరి తర్వాత వచ్చిన కొత్త దరఖాస్తులను కూడా విడతల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కూటమి నేతలు చెబుతున్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరుతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




