Andhra Pradesh: 72 గంటల్లో పీఆర్సీపై సీఎం జగన్‌ నిర్ణయం

*సీఎం జగన్‌కు పీఆర్సీపై నివేదిక ఇచ్చిన కమిటీ *14.29 శాతం ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేసిన సీఎస్ కమిటీ

Sandeep Reddy
Published on: 14 Dec 2021 7:13 AM IST
AP CS Committee Submits PRC Report to AP CM Jagan
X

సీఎం జగన్‌కు పీఆర్సీపై నివేదిక ఇచ్చిన కమిటీ(ఫోటో: ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీ సీఎస్ ఆధ్వర్యంలో పీఆర్సీ, ఫిట్ మెంట్ పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎం జగన్ కు సమర్పించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన సీఎస్ సమీర్ శర్మ సహా కమిటీ సభ్యులు నివేదికను అంద చేశారు. పీఆర్సీ కమిటీ నివేదికలోని 11 సిఫార్సులను ఆమోదిస్తున్నట్లు సీఎస్ శర్మ తెలిపారు. ఐదు సిఫార్సులను తగు మార్పులు చేసి ఆమోదించాలని సూచించినట్లు తెలిపారు. రెండు సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం లేదని తాము సిఫార్స్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత మేర ఫిట్ మెంట్ ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయమై ఏడు అంశాలను నివేదికలో పొందుపరిచారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై నివేదికలో పలు అంశాలను ప్రస్తావించారు సీఎస్ సమీర్ శర్మ. 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 23శాతం ఫిట్‌మెంట్‌, 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 27 శాతం ఫిట్‌మెంట్‌, 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 14 శాతం ఫిట్‌మెంట్‌, 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఇలా 7 రకాల ప్రతిపాదనలు రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడింటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై 8 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. కాంట్రాక్ట్, పొరుగుసేవల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకూ ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేశామని, అధికారులు, నిపుణులతో చర్చించాక ఫిట్‌మెంట్‌ ఎంత ఇవ్వాలన్న దానిపై సీఎం జగన్‌ 3 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారని చెప్పారు..పెండింగ్‌ డీఏలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'' అని సీఎస్‌ వివరించారు.

11వ పీఆర్సీని 23 శాతం ఫిట్ మెంట్ తో ఇస్తే ఏడాదికి 11 వేల 557 కోట్లు భారం పడుతుందని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. 27 శాతం ఫిట్ మెంట్ ఇస్తే ఏడాదికి 13 వేల 422 కోట్లు భారం పడుతుందని, 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం 14 శాతం ఫిట్ మెంట్ ఇస్తే 9 వేల 150 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫిట్ మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలకు అమలు చేయాలని కీలకంగా సిఫార్సు చేసినట్లు సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. మధ్యంతర భృతి కింద ఉద్యోగులకు ఇప్పటికే 16 వేల కోట్లు ఇచ్చామని.. పెండింగ్ డీఏ కూడా ఇవ్వాల్సి ఉందన్నారు. 2018 నుంచి ఉద్యోగులకు ఫిట్ మెంట్ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story