రాష్ట్రానికి 'హోదా' ఇవ్వండి.. మండలి రద్దు ప్రక్రియ పూర్తి చేయించండి : YS Jagan
![](https://assets.hmtvlive.com/h-upload/uid/nullLMiEH58Moz5Ad7STQMMSalyKnAevq5mw9441802.jpg)
![రాష్ట్రానికి హోదా ఇవ్వండి.. మండలి రద్దు ప్రక్రియ పూర్తి చేయించండి : YS Jagan రాష్ట్రానికి హోదా ఇవ్వండి.. మండలి రద్దు ప్రక్రియ పూర్తి చేయించండి : YS Jagan](https://assets.hmtvlive.com/h-upload/2020/02/13/282755-untitled-design--2020-02-13t101544308.webp)
ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన...
ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం ఈ భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.
హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీతో ఆయన నివాసంలో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రధానికి ఆయన నివేదించారు. విభజన అంశాలు, ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై సీఎం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉగాది రోజున 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని జగన్ ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు అందజేయాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు ప్రధానికి సీఎం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు.
అలాగే, 2021 నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానికి అందజేసిన వినతిపత్రంలో సీఎం పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్ ప్రకారం చేయాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,549 కోట్లకు చేరిందని దీనిలో ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.33010 కోట్లు అవసరమవుతుందని సీఎం తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ ఫిబ్రవరి 2019న పోలవరం అంచనాలను రూ.55,549 కోట్లుగా అంచనా వేసిందని గుర్తు చేశారు. దీనికి పాలనాపరమైన అనుమతులు ఇంకా రాలేదని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని కోరారు.
ఇక రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప ఉక్కు కర్మాగారం, రామాయపట్నం పోర్టు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని జగన్ కోరారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని మిగిలిన నిధులనూ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడిన 7 జిల్లాలకు గడిచిన ఆరేళ్లలో కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరారు జగన్.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానికి సీఎం తెలిపారు. దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే, శాసనమండలి రద్దు అంశాన్ని వినతిపత్రంలో పేర్కొన్న సీఎం శాసనసభ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపామని ఈ అంశంలో తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఏపీ దిశ చట్టం-2019కు ఆమోదం తెలపాలని కోరారు సీఎం జగన్.
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire