AP Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

*75 శాతం హాజరుంటేనే అమ్మ ఒడి సొమ్ము! *కొత్తగా ఈడబ్ల్యూఎస్‌ శాఖ ఏర్పాటు *అగ్రకులాల పేదలకు ప్రత్యేక కార్పొరేషన్లు

Shilpa
Published on: 29 Oct 2021 7:29 AM IST
AP Cabinet Taken Key Decisions on AP Development‌
X

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌(ఫైల్ ఫోటో) 

AP Cabinet: ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. వెనుకబడిన వర్గాల జనాభాను లెక్కించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2021 జనాభా లెక్కల ప్రక్రియలో బీసీ కుల గణన చేర్చాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే బాధ్యతను బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణకు అప్పగించారు. అలాగే రాష్ట్రంలో 'అమ్మఒడి' పథకాన్ని 2022 జూన్‌లో అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అలాగే వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో కొత్తగా పోస్టులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యవిద్యవిభాగంలో టీచింగ్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ విభాగాల్లో 2,190 పోస్టులను కొత్తగా మంజూరుకు తీర్మానించారు. రేషన్‌కార్డు, ఇంటిస్థలం వంటి పథకాలు సాంకేతికత సమస్యల కారణంగా నిలిచిపోతే అర్హులు జూన్‌, డిసెంబరు నెలల్లోదరఖాస్తు చేసుకునే వెసలుబాటు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇక సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ విధానంలో విక్రయించేలా 1965 సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేయాలని కేబినెట్‌ ఫిక్స్‌ అయ్యింది. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఈడబ్ల్యూఎస్‌ అనే కొత్త శాఖ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ఓ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 27 వేల మంది జైనులు, 10 వేల మంది సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్‌ భావించింది.

దీంతో పాటు ఏపీ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ చట్టానికి చేసిన సవరణలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. మరోవైపు విశాఖలో ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 130 ఎకరాల భూమిని, విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జేఎన్టీయూ కాకినాడ-గురజాడ విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో, ఆంధ్ర కేసరి విశ్వద్యాలయం ప్రకాశం జిల్లాలో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Shilpa

Shilpa

Next Story