Tirumala Laddu Issue In Assembly: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఇదీ విషయం.. సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్

CM Chandrababu Naidu Power Point Presentation on Tirumala Laddu Row
x

సీఎం చంద్రబాబు నాయుడు 

Highlights

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 20 కోట్ల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని, దీనిపై సిట్ విచారణ కొనసాగుతోందని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సభకు వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ కాలంలో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ నెయ్యితో కోట్లాది లడ్డూలను తయారు చేశారని ఆయన ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కుట్రలో కొంతమంది అధికారులు, నిపుణులు కూడా భాగస్వాములయ్యారని ఆయన విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ జరిగిన ఈ వ్యవహారాన్ని ఆయన 'మహాపాపం'గా అభివర్ణించారు.

అసెంబ్లీలో సమర్పించిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో సుమారు 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీని ద్వారా సుమారు రూ. 231.51 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. నెయ్యి నాణ్యత లేదని రిపోర్టులు వచ్చినప్పటికీ, అప్పటి పాలకులు వాటిని బయటకు రాకుండా తొక్కిపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

ఈ కేసు దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీబీఐ పర్యవేక్షణలో సాగుతున్న ఈ విచారణలో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక 'ఏక సభ్య కమిషన్'ను కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

చర్చలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ అపవిత్ర కార్యం చేసిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడాలని డిమాండ్ చేశారు. ఎన్‌డీడీబీ (NDDB) నివేదికలో జంతు సంబంధిత కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని ఆయన గుర్తు చేశారు. కల్తీ నెయ్యిలో అసలు నెయ్యే లేదని, అది కేవలం రసాయనాల మిశ్రమమని సిట్ నివేదిక ద్వారా తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీవారి లడ్డూ పవిత్రతను కాపాడటంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ప్రభుత్వం విమర్శించింది. ఎన్‌డీడీబీ రిపోర్టును తాను చదవడం వెనుక ఆ భగవంతుడి సంకల్పం ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో పటిష్టమైన నిబంధనలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థల పర్యవేక్షణలో లోతైన విచారణ జరుగుతోంది. లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో, దోషులను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories