మండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ సంచలన తీర్మానం..

మండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ సంచలన తీర్మానం..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ సంచలన తీర్మానం చేసింది. సలహాలు ఇస్తుంది అని ఏర్పాటు చేసుకున్న మండలి రాజకీయాలకు వాడుకుంటున్నారని అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ సంచలన తీర్మానం చేసింది. సలహాలు ఇస్తుంది అని ఏర్పాటు చేసుకున్న మండలి రాజకీయాలకు వాడుకుంటున్నారని అభిప్రాయపడింది. ఈ మేరకు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దాదాపు గంటపాటు చర్చించిన క్యాబినెట్ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీకి పంపింది. కాగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఎగువ సభగా గుర్తింపు పొందింది. విధాన పరిషత్తు 1958 నుండి 1985 మరియు 2007 నుండి ప్రస్తుతం వరకు రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుత అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 మంది సభ్యులతో ఉంది. అయితే ముగ్గురు సభ్యులు రాజీనామాతో ప్రస్తుతం 55 మందే మండలికి సభ్యులుగా ఉన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే సభ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసింది. అయితే 1956 డిసెంబరు 5 న ఆంధ్రప్రదేశ్ విధాన సభ శాసనమండలి ఏర్పాటు చేయడానికి తీర్మానం చేసింది. అధికారికంగా విధాన పరిషత్తు 1958 జూలై 1 న ప్రారంభించబడింది. ఈ ఏర్పాటు భారత రాజ్యాంగంలోని 168 అధికరణం మూలంగా జరిగింది. 1968 జూలై 8 న అప్పటి భారత రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ మండలిని ప్రారంభోత్సవం చేశారు. అలా ప్రారంభమైన మండలి 1985 లో ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (నిర్మూలన) చట్టం ద్వారా విధాన పరిషత్‌ను రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించింది. ఆ తరువాత రెండేళ్లకు పార్లమెంటులో ఆమోదం పొంది ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దయింది.

అయితే 1989 లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డిలో శాసన మండలిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.. శాసన మండలిని పునరుద్ధరించడానికి 1990 జనవరి 22 న అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆమోదించారు. అయితే మరలా పంపిన తీర్మానాన్ని పార్లమెంటు పట్టించుకోలేదు. దాంతో ఆ తీర్మానం మరుగున పడింది. ఆ తరువాత 2004 కేంద్ర, రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ జులై 8, 2004 న శాసన మండలి పునరుద్ధరణకు మరొక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో 2004 డిసెంబర్ 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. అయితే దీన్ని 2006 డిసెంబరు 15 న లోక్‌సభ ఆమోదించింది. డిసెంబర్ 20 న రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో.. 2007 జనవరి 10 న రాష్ట్రపతి ఆమోదం పొందింది. దాంతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 2007 మార్చి 30 న ఏర్పాటైంది. ఏప్రిల్ 2 న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ మండలిని ప్రారంభించారు. ఆ తరువాత మరోసారి శాసనమండలిని రద్దు చేస్తూ ఇవాళ వైసీపీ ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories