TTD Audit with CAG: ఇక టీటీడీ ఎకౌంట్స్ ఆడిట్ కాగ్ ఆధ్వర్యంలో.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

TTD Audit with CAG: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అత్యంత ఆదాయం ఉన్న ఆధ్యాత్మిక సంస్థ.

K V D Varma
Published on: 3 Sept 2020 9:10 PM IST
TTD Audit with CAG: ఇక టీటీడీ ఎకౌంట్స్ ఆడిట్ కాగ్ ఆధ్వర్యంలో.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!
X

TTD Audit with CAG: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అత్యంత ఆదాయం ఉన్న ఆధ్యాత్మిక సంస్థ. ఇప్పటివరకూ ఆ సంస్థకు సంబంధించిన లెక్కలన్నీ ఇక్కడే జరిగిపోయేవి. తప్పయినా..ఒప్పయినా టీటీడీ చేసిందే కరక్ట్ అన్నచందంగా వ్యవహారం నడిచిపోయేది. అయితే, ఇప్పుడు జగన్ సర్కారు ఆ లెక్కను మార్చింది. అన్ని ప్రభుత్వ సంస్థల ఆదాయ వ్యయాల లెక్కలు ఆడిట్ చేసే దేశ అత్యున్నత సంస్థ కాగ్ ద్వారా టీటీడీ లెక్కలపై ఆడిట్ చేయించాలని నిర్ణయం తీసుకుంది.

నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించడంతోపాటు, ఇక ముందు కూడా ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్‌ సబర్వాల్‌తో కలసి సుబ్రహ్మణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే, దానికి స్పందన లభించలేదు. అయితే, ఈ ప్రతిపాదనపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

టీటీడీలో జరుగుతున్న ఆడిట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇకపై ఆడిట్‌ను కాగ్ ద్వారా చేయాలని పాలకమండలి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం వెంటనే ఆ సిఫారసు ను ఆమోదిస్తూ.. నిర్ణయం తీసుకుని చర్యలకు ఉపక్రమించింది.


బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం అని కొనియాడారు. ఈమేరకు అయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా టీటీడీ ఆదాయ, వ్యయాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పారు. తద్వారా టీటీడీకి భక్తులు, దాతలు విరాళాల రూపంలో ఇస్తున్న నిధుల నిర్వహణ సక్రమంగా ఉండాలని నిర్దేశించారు.

ఈ మేరకు 2020–21 నుంచి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించింది. హైకోర్టుకు కూడా తెలియజేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. తన ప్రతిపాదనను సీఎం వైఎస్‌ జగన్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు స్పందించిన వైవీ సుబ్బారెడ్డి పారదర్శకత, అవినీతిరహిత పాలన పట్ల సీఎం నిబద్ధతతో ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు స్వామి వారి భక్తులు కూడా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.



K V D Varma

K V D Varma

Next Story