ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ

అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

Siramdasu Nagarjuna
Published on: 11 Dec 2025 5:45 PM IST
ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ
X

అమరావతి: అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో గురువారం వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సీఎం సమావేశం అయ్యారు. వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా ఏర్పాటు అవుతున్నట్టు వివరించింది. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి.. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. క్వాంటం పరిశోధనలతో బయోసెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు.

అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఈ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయని వారికి వివరించారు. నేషనల్ క్వాంటం మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే మొత్తంగా క్వాంటం ఎకో సిస్టం అమరావతికి వస్తోందని సీఎం అన్నారు. గతంలో అందిపుచ్చుకున్న ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు క్వాంటం గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో ఆ రంగంలో పనిచేయడానికి ఔత్సాహిక కంపెనీలు ఏపీని సంప్రదిస్తున్నాయని అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటర్ కేంద్రం ద్వారా పరిశోథనలు చేసి ఔషధాలు, మెటీరియల్ సైన్స్ సహా వివిధ అంశాల్లో వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. క్వాంటం బయోఫౌండ్రీ అనేది వినూత్న ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు.

బయోమెడికల్ రీసెర్చితో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా సహా వేర్వేరు రంగాల్లోని భాగస్వాములు క్వాంటం వ్యాలీ సేవలను వినియోగించుకునేలా ఎకోసిస్టం అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చి సంస్థలకు ఏక్యూసీసీ కేంద్రంగా అవుతుందని తెలిపారు. రూ.200 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటిరియల్ సైన్స్ పై పరిశోధనలు చేయనున్నట్టు విద్యావేత్తలు, పరిశోధకుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. క్వాంటం వ్యాలీతో పాటు, ఏపీలో అమలవుతున్న విధానాలను తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story