సినిమా టికెట్ రేట్లకు త్వరలో ఒకే జీవో: మంత్రి దుర్గేష్


ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, అన్ని సినిమాలకు వర్తించేలా ఒకే సమగ్ర జీవోను తీసుకురావాలని భావిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, అన్ని సినిమాలకు వర్తించేలా ఒకే సమగ్ర జీవోను తీసుకురావాలని భావిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన సినిమా టికెట్ ధరల హేతుబద్దీకరణ కమిటీ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ప్రతి సినిమా బడ్జెట్ను బట్టి విడివిడిగా జీవోలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికి, ఒకే విధానం కింద టికెట్ ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సినిమా పరిశ్రమ మనుగడ సాగించడంతో పాటు, సామాన్య ప్రేక్షకుడిపై భారం పడకుండా సమతుల్యత పాటిస్తామని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సినీ పరిశ్రమకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. పెద్ద బడ్జెట్ సినిమా, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ పై చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ల ధరలు పెంచే విధానం పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలు కూడా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు సినిమా పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ అయిందని అన్నారు. పాన్ ఇండియా సినిమా వల్ల నిర్మాతలకు బడ్జెట్ విపరీతంగా పెరుగుతోందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఏపీలో సినిమా టికెట్ల రేట్ల హేతుబద్దీకరణపై ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్, ఏపీ ఎస్ ఎఫ్ టీవీ, టీడీసీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, లా డిపార్ట్ మెంట్ సెక్రటరీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సమీక్షా సమావేశం ఇవాళ జరిగిందన్నారు. మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ల టికెట్ ధరల హేతుబద్దీకరణపై, హై బడ్జెట్ సినిమా టికెట్ల పెంపునకు అనుసరించాల్సిన విధానాలపై కమిటీ చర్చించిందన్నారు. సమగ్రంగా చర్చించిన అనంతరం కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుందని వెల్లడించారు.
ఇప్పటివరకు పాత జీవో ప్రకారం హోం శాఖ ద్వారా సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నామని, ప్రస్తుతం లో బడ్జెట్, హై బడ్జెట్ సినిమాలకు ఎంత ధర ఉండాలనే అంశంపై కమిటీ చర్చిస్తోందన్నారు. ఎంత శాతం ఏపీలో చిత్రీకరణ జరపాలన్న అంశంపై నిబంధనలు నిర్ణయిస్తామన్నారు. షూటింగ్ లతో పాటు పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయాలుంటాయన్నారు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత త్వరలోనే కొత్త జీవో జారీ చేస్తామన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత నిర్మాతలకు ప్రభుత్వం అండగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇండియాలో ఏపీని చలచిత్ర నిర్మాణానికి ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. అంతకుముందు కమిటీ సభ్యులు దర్శకులు జాస్తి ధర్మతేజ, డిస్ట్రిబ్యూటర్ నక్కలపూడి సాయిబాబు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూచిబట్ల వివేక్, ఎగ్జిబిటర్ లు సోంపల్లి శివ ప్రసాద్, అలంకార్ ప్రసాద్ తదితరులు మంత్రి దుర్గేష్ తో పేషీలో భేటీ అయి తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం మంత్రి దుర్గేష్ ను సత్కరించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



