కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామారెడ్డి మండల కేంద్రంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్దకు ప్రభుత్వం అందిస్తున్న 1,500 రూపాయలు తీసుకొనేందుకు వచ్చిన ఓ మహిళ ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోయింది. కన్నపూర్ తండాకు చెందిన నేనావత్ కమల (45) అనే మహిళ తన ఖాతాలో జమ అయిన రూ.1,500 కోసం బ్యాంకు వద్దకు వచ్చింది. అక్కడ జనం ఎక్కువగా ఉండడంతో లైన్లో నిలబడింది.
డబ్బులు కోసం క్యూ లైన్ లో నిలబడిన కమల హఠాత్తుగా కిందపడిపోయింది. దాంతో పక్కనున్న వాళ్ళు అప్రమత్తమై 108 కి ఫోన్ చేశారు. వారు వెంటనే బ్యాంకు వద్దకు వచ్చి కమలను పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందింది. బ్యాంకు వద్ద ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని రామారెడ్డి సర్పంచ్ సంజీవులు తెలిపారు. అనుకోకుండా ఘటన జరగడం బాధాకరమని అన్నారు. టోకెన్ల ప్రకారమే డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.