ఉదయం లేవగానే చాలా మందికి కావలసింది చిక్కటి టీ. ఈ టీ తాగకపోతే చాలు ఏ పనీ చేయలేము. పొద్దున్న పేపర్ చదవడం నుంచి ఆఫీస్ కు వెళ్లేలోపు కనీసం రెండు కప్పుల టీ అయినా తాగ కుండా ఉండలేరు కొంత మంది. మరి అంత ఉదయాన్నే టీ తాగాలంటే కావలసింది పాలు. ఇక ఈ పాల ధరలు ఒకప్పుడు రూ.10కి లీటరు ఉండేది. అన్ని నిత్యావసర ధరలు పెరిగినట్టే రాను రాను ఈ పాల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇది చాలదన్నట్టు మళ్లీ పాలధరలను పెంచారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పెరిగిన పాల ధరలు అమలు చేయనున్నారు. ఈ ధరలను పెంచాలని పాడి పరిశ్రమ అభివృద్ది, సహకార సమాఖ్య (టీఎస్డీడీసీఎఫ్) నిర్ణయించింది. ప్రతి లీటరుకు రూ.2 చొప్పున పెరగనున్నాయి. పాడికి పెట్టే మేత ధరలు పెరగడంతో పాడి రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాల ధరలను పెంచారు. దీంతో వారు కూడా పాల విక్రయ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు టీఎస్డీడీసీఎఫ్ తెలిపింది. ఇకపోతే స్టాండర్డ్ మిల్క్, హోల్ సేల్ పాల ధరల్లో మార్పు లేదని యాజమాన్యం పేర్కొంది. పెరిగిన పాల ధరలను చూసుకున్నట్లయితే వెండర్ మార్జిన్ను లీటర్కు 25 పైసలు, బేస్ మార్జిన్ను రూ. 3.25 పైసలు పెంచినట్లు తెలిపారు.