తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశలో మొత్తం 3, 701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 769 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 10,654 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. కాగా పోలింగ్ సందర్బంగా ఇవాళ ఉదయం 7 గంటలకే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేశారు.
సంగారెడ్డి జిల్లా డాకూర్లో సినీ హీరో జయంత్రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని కోరారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని 14వ బూత్లో పాలకుర్తి టీఆరెస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఆయన సతీమణి ఉషా దయాకర్రావు ఓటు వేశారు.