డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించాలి... సీఐఐ సదస్సులో మంత్రి కేటీఆర్‌

డిజిటల్‌ ఆవిష్కరణలు ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2020-05-23 07:47 GMT
KTR

డిజిటల్‌ ఆవిష్కరణలు ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన 'డిజిటల్‌ రెవెల్యూషన్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా, టచింగ్‌ లైవ్స్‌ ఎన్‌రిచింగ్‌ బిజినెసెస్‌' అంశంపై డిజిటల్‌ సదస్సుకు ఆయన ముఖ్చఅతిథిగా హాజరయ్యారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ వర్క్స్‌ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కరోనా రోగులకోసం వెంటిలేటర్‌ను తయారుచేసిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి దాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా దాని ధర కేవలం రూ.35వేలుగా నిర్ణయించామని కేటీఆర్‌ తెలిపారు. డిజిటల్‌ విప్లవం సాధించాలంటే డిజిటైజేషన్‌ను ప్రాథమిక హక్కుగా చూడాలని అన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో వివిధ రంగాలలో, జీవన విధానంలో డిజిటల్‌ వినియోగం పెరిగిందని తెలిపారు. వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి డిజిటల్‌ లిటరసీ, రోజువారీ వ్యవహారాలు, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డిజిటల్‌ ఇన్నోవేషన్‌పై దృష్టిసారించాలని చెప్పారు. డిజిటల్‌ విధానంలో మూడు ప్రధానమైన అంశాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఒక్కో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న విధానాల గురించి ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు తరగతులను టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యార్థులకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహించలేమని ఆయన తెలిపారు. వారికి ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

టెలిమెడిసిన్‌ విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నామని, డ్రోన్‌ల ద్వారా అత్యవసరమైన మందులను సరఫరాచేస్తున్నామని తెలిపారు. దేశంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి షాంఘై, సిలికాన్‌ వ్యాలీ సహా ప్రపంచంలోని అనేక ఇతర నగరాలతో పోటీపడే సామర్థ్యం ఉందన్నారు. తమిళనాడులోని తిరుప్పూర్‌ ఒకనాడు చిన్న గ్రామమని, అదే గ్రామం నుంచి ఈ రోజున రూ.40వేల కోట్ల విలువైన వస్త్రాలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కృష్ణ బోడనపు, సీఐఐ మాజీ అధ్యక్షుడు రాజన్న, ఎస్టీపీఐ డీజీ ఓంకార్‌ రాయ్‌, మొబైల్‌ ప్రీమియర్‌ లీజ్‌ సీఈవో సాయి శ్రీనివాస్‌ కిరణ్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా సీఐఐ డైరెక్టర్‌ సుబహాజిత్‌ సహా వ్యవహరించారు.


Tags:    

Similar News