వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. బీహార్ తదితర రాష్ర్టాలనుంచి మన రాష్ట్రానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలసకూలీలను తరలించడం కోసం ఒక్క బోగీ అదనంగా వేయడానికి రైల్వేశాఖకు కనికరం కలుగడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రైల్వేశాఖ వలస కార్మికుల పట్ల సంక్షోభ సమయంలో కూడా మానవత్వం చూపడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. సుమారు 95 మంది కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు శిబిరంలో వేచివున్నారని, వారందరినీ ఒకేసారి తరలించడానికి అదనంగా ఒక బోగీ ఏర్పాటు చేయవచ్చు కదా అని ధర్మాసనం రైల్వేశాఖను ప్రశ్నించింది.
గూడ్స్ రైలుకు 70 బోగీలు ఉంటాయని, సాధారణ రైలుకు 24కి మించి బోగీలు ఉండకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని ప్రశ్నించింది. వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు, ఉన్నతాధికారుల కుటుంబాలు వెళ్లడానికి రైల్వేశాఖ ప్రత్యేక బోగీలు కేటాయిస్తారని తెలిపింది. అదే వలసకార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఎందుకు కేటాయించలేరని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
సికింద్రాబాద్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నా కూడా.. ఖాళీగా లేదని జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదించడంపై ధర్మాసనం మండిపడింది. అనంతరం అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ రాష్ట్రాంలో ఉన్న వలస కార్మికులకు మనోరంజన్ కాంప్లెక్స్లో తాత్కాలిక వసతి ఏర్పాట్లుచేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం మనోరంజన్ కాంప్లెక్స్లో ఖాళీలేదని, ప్రస్తుత వసతి కేంద్రంలో కొద్దిమందికి వసతి ఏర్పాట్లు సరిపోతాయని అధికారులు ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న మనోరంజన్ భవనంలో ఎన్ని గదులు, ఎన్నిహాల్స్ ఉన్నాయో హైకోర్టు రిజిస్ట్రీ అధికారులు స్వయంగా పరిశీలించారని పేర్కొన్నది. దీంతో ఆ కాంప్లెక్స్ను రిజిస్ట్రార్లు స్వయంగా పరిశీలించారని, మొత్తం కాంప్లెక్స్ ఖాళీగా ఉందని చెప్పింది. వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుని, అది వాస్తవం కాదని, అన్ని వసతులు ఉన్నాయని తేల్చి చెప్పింది.