ఆ పార్టీలో దాదాపు అందరూ సీనియర్లే.. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన నేతలు మరోపోరుకు సిద్ధమయ్యారు. రాజకీయ మైలేజ్ను సాధించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలను అస్త్రాలుగా తీసుకుని రంగంలోకి దిగుతోంది. కృష్ణానదితో పాటు గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు కూడా ఎందుకు పూర్తి కావడం లేదనే అంశాన్ని లెవనెత్తి ప్రజల మద్దతు పొందేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కృష్ణా గోదావరి నదులపై నిర్మించ తలపెట్టి మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టుల దగ్గర నిరసన దీక్షలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రెండు జీవనదులపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వినియోగంలోకి రాకపోవడంతో కలిగే నష్టం ప్రజలకు వివరించి వారి మద్దతును చూరగొనాలని తెగ ట్రై చేస్తోంది. సమిష్టిగా నాయకులందరూ కలిసి పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ జారీ చేసిన జీవో తెలంగాణలో రాజకీయ వేడిని రగిలిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అయ్యింది. జూన్ 6న గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు దీక్షలకు దిగబోతున్నారు. మొన్నటి వరకు, రైతు, ప్రజా సమస్యలపై ఆందోళన బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ మరోసారి ప్రాజెక్టులపై పోరు బాటపట్టనుంది.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెండింగ్ పనులను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల ఉద్యమ బాటపడుతున్నారు. జూన్ 6న గోదావరి బేసిన్లోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల వద్ద దీక్షలు, నిరసనలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం అంతా ప్రాజెక్టుల చుట్టే తిరగనుంది. ప్రజా సమస్యలను భుజాన ఎత్తుకున్న కాంగ్రెస్ నేతలు వాటిని తీరం దాక తీసుకెళ్లతారా లేక నడి సంద్రంలో వదిలేస్తారా అనేది వేచి చూడాలి మరి.