పింఛన్ల పెంపు, కొత్త మున్సిపల్ చట్టంపై తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించిన సర్కారు పింఛన్లను జూన్ నెల నుంచే చెల్లిస్తామని స్పష్టం చేసింది. అలాగే గతంలో చేసిన మున్సిపల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాన్ని ఆమోదించిన కేబినేట్ దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించనుంది.
బుధవారం సమావేశం అయిన తెలంగాణ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఇచ్చిన హామీ అయిన పింఛన్ల పెంపు అమలుకు.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సుమారు 5 గంటల పాటు కొనసాగిన కేబినేట్ భేటీలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి గ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్ను వెయ్యి నుంచి నుంచి 2 వేల 16 కు పెంచాలని నిర్ణయించారు.
అలాగే దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ను 1500 నుంచి 3 వేల 16 కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్ను గత నెల జూన్ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. అయితే జూన్కు సంబంధించిన పెన్షన్ను జూలై నెలతో కలిపి లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ 20 న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు. అంతేకాకుండా.. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయో పరిమితిని.. 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అలాగే తెలంగాణ నూతన మునిసిపల్ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. శాసనసభతో పాటు మండలిలోనూ చర్చ జరిపి ఆమోదిస్తారు.