పోలీసులు టీఆర్ఎస్ నేతలకు సలాం చేస్తున్నారు: బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయ
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరులోని ఓ కాలేజ్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరులోని ఓ కాలేజ్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏరియా ఆస్పత్రి మార్చురీ తాళం పగలగొట్టి సంధ్యారాణి మృతదేహాన్ని కాలేజ్కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రయత్నించగా పోలీసులు మృతురాలి తండ్రిని బూటు కాళ్లతో తన్నారు. ఇప్పుడు ఈ విషయం సర్వత్రా విమర్శలు వ్యక్తమువుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయ మండిపడ్డారు. పోలీసుల తీరును వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల లాగా వ్యవహరిస్తున్నారని ఈ సంద్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులు టీఆర్ఎస్ నేతలకు సలాం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఢిల్లీలో పోలీసుల తీరును ట్విట్టర్లో ప్రశ్నించిన కేటీఆర్కు తెలంగాణలో పోలీసులు చేస్తున్న నిర్వాకాలు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అనేక మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని, ఇంకా అవుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలపై ఎప్పటి కప్పుడు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. ఆదిలాబాద్లో ఎస్సీ బిడ్డపై అఘాయిత్యం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల తీరు ఖాకీ చొక్కాలా కాకుండా గులాబీ రంగు చొక్కా వేసుకున్నట్లుగా ఉందని మండిపడ్డారు. నారాయణ కళాశాలలో బిడ్డ చనిపోయిన దు:ఖంలో ఉన్న తండ్రిని బూటు కాలితో తన్నడమేనా బంగారు తెలంగాణ అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
ఇక పోతే ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటనపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్విటర్లో స్పందించారు. 'ఇది ఎంతో దురదృష్టకర సంఘటన అని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆ అధికారుల విషయంపై ఎంక్వైరీ చేసి వారిని వెంటనే విధుల నుంచి తప్పించామని తెలిపారు. ఇంకెప్పుడూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీని ఆదేశించాం' అని ఆయన ట్వీట్ చేశారు.