ఐదు ప్రైవేటు వర్సిటీలకు ఆమోదం : సంతకం చేసిన గవర్నర్
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో ఐదు ప్రయివేటు యూనివర్సిటీల స్థాపనకు రెడీగా ఉన్నాయి. ఇందుకు ఆమోదం తెలుపుతూ దానికి సంబంధించిన ఫైల్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం సంతకంచేశారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల స్థాపన కోసం 13 విద్యాసంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. కాగా వాటిలో మహీంద్రా, వాక్సన్, మల్లారెడ్డి, ఎస్సార్ యూనివర్సిటీ వరంగల్, అనురాగ్ వర్సిటీలు మాత్రమే అనుమతి పొందాయి.
ఆమోదం పొందిన యూనివర్సిటీలు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎన్వోటీ) మల్లారెడ్డి, మహీంద్రా, అనురాగ్, వాక్సన్, ఎస్సార్ వరంగల్, గురునానక్, శ్రీనిధి, నిక్మర్, ఎంఎన్నార్ సంస్థలకు జారీచేసింది. ఇవి కాకుండా విజ్ఞాన్ రత్తయ్య, వాగ్దేవి వరంగల్, అమిటీ, రాడ్క్లిఫ్ సంస్థలకు అనుమతి రావాల్సి ఉన్నది. 2020-21లో ప్రారంభమయ్యే బ్యాచ్లే వర్సిటీలుగా కొనసాగనున్నాయి. ఈ విద్యాసంస్థలు వర్సిటీలుగా మారినప్పటికీ ప్రస్తుతం వాటిల్లో చదువుతున్న విద్యార్థుల వరకు కాలేజీగానే కొనసాగుతాయి.