ఇంటర్ మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలను బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియెట్ నిర్వహించింది. కాగా వారికి ధియరీ పరీక్షలను మార్చి 4వ తేదీ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 9,65,815 మంది విద్యార్థులు హాజరవుతారన్నారని బోర్డు అధికారులు తెలిపారు. కాగా థియరీ పరీక్షలను నిర్విహించడానికి 1,339 కేంద్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలని, ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ పరీక్షల సమయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షలను పారదర్శక రీతిలో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష సెంటర్ లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించాలని, ఏ ఒక్క విద్యార్థికి కూడా పరీక్షలో ఆటంకం కలగకూడదని తెలిపారు.
ఇందుకు గాను కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా బాధ్యతతో వ్యవహరించాలని, అన్ని విభాగాలను కలుపుకుని పరీక్షలను విజయవంతం చేయాలని తెలిపారు. దాంతో పాటుగానే పరీక్ష సమయంలో విద్యార్థులకు రవాణా పరంగా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సౌకర్యం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు శ్రద్దగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో సెంటరుకు చేరుకోవాలని తెలిపారు. అధికారులు చెప్పిన అన్ని నిబంధనలను విద్యార్థులు పాటించాలి సూచించారు. అంతే కాకుండా పిల్లలు చదువుకునే సమయంలో తల్లిదండ్రులు వారిని డిస్టర్బ్ చేయకూడదని, పిల్లలను పనులకు పంపించకూడదని అన్నారు. పిల్లలు చదువులో ముందుకు రానించే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని తెలిపారు.