అభివృద్ధి, ఆహ్లాదాలకు ఈ ఊరు అడ్డాగా మారింది. సెంటర్లలో ఏర్పాటు చేసిన అందమైన ఆక్షరణీయమైన కట్టడాలు ప్రజల మనసు దోచుకుంటుకున్నాయి.హైదరాబాద్కే పరిమితమైన ఓ అందమైన కట్టడం ఇప్పుడు అక్కడి వారిని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. నెలరోజుల వ్యవథిలోనే అందుబాటులోకి వచ్చి అందరిని మనసు దోచుకుంటోన్న విషయమేంటో ఇప్పుడు చూద్దాం.
లైఫ్స్టయిల్ మార్పుకి సింబాలిక్గా మారింది సిద్ధిపేట పట్టణం. ఆహ్లాదాన్ని పంచే పార్కులే కాదు అద్భుతమైన డిజైన్లకు కేరాఫ్గా మారింది. అందమైన ఆహ్లాదకరమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్న మంత్రి హరీశ్రావు ఆలోచనలకు అనుగుణంగా మున్సిపాలిటీ, సుడాలు పట్టణంలో పలు సుందరీకరణ పనులు చేసి అందరి చేత వావ్ అనిపించుకుంటున్నారు. ఇక బీజేఆర్ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తా, ఎక్బాల్ మినార్ ఈగల్ స్టాచ్యులు ప్రజలను ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రధాన సర్కిల్లో ఏర్పాటు చేసిన డాల్ఫిన్, సీతాకోకచిలుక, నెమలి బొమ్మల ఆకృతులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ల్యాండ్ స్కేప్ గ్రాస్తో పచ్చదనం సంతరించుకునేలా ఏర్పాటు చేసి, సర్కిల్ చుట్టూ రేడియం వర్క్ చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ ఫౌంటెన్ల ద్వారా నీటిని వివిధ రంగులతో కనిపించేలా విరజిమ్ముతూ చౌరస్తాలు అందంగా ఆకర్షణీయంగా మారాయి.
ఇరానీ ఛాయ్, కేఫ్లకు కేరాఫ్గా ఇక్బాల్ మినార్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. టీ పాయింట్కి సెంటర్గా మారిన ఈ ఏరియాలో కేటిల్లో నుంచి చాయ్ కప్పు సాసర్లో పోస్తున్న ఆకృతితో ఏర్పాటు చేసిన డిజైన్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. పైగా కలర్ఫుల్ లైటింగ్ను ఏర్పాటు చేయడంతో ఫౌంటెన్ అందాలను చూసి ఫిదా అవుతున్నారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ బ్యూటిఫికేషన్ బహుత్ అచ్చా హైసాబ్ అంటున్నారు స్థానికులు.
హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన అందాల డిజైన్లు తమ ప్రాంతంలో కనువిందు చేయడం ఆనందంగా ఉంటుందంటున్నారు ప్రజలు. ఇప్పటికే కోమటి చెరువుపై రోప్సైక్లింగ్ , కదిలే వంతెన సౌకర్యాలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.