వికారాబాద్ జిల్లా పులిమద్దిలో గ్రామస్తులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లను కచ్చితంగా వాడాలని దండోరా వేయించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలని హెచ్చరించారు. మరుగుదొడ్లను వాడని వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే వారి ఇంటికి కరెంట్, రేషన్, పింఛను వస్తుంటే అది కూడా కట్ చేస్తామని డప్పుతో చాటింపు వేయించారు. ఉపాధి హామీ పనులకు కూడా రానివ్వరని తెలిపారు. ఇంత ప్రచారం చేసినా నిబంధనలు పాటించకుండా బహిరంగ మలవిసర్జనకు బయలుదేరిన కొందరిని దారిలోనే అడ్డుకున్నారు.